ఈ నెల 11వ తేదీన జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయాల సముదాయాన్ని, టీఆర్ఎస్ జనగామ జిల్లా కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా తేదీన ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో వీటిని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు.
అదే రోజు సీఎం బహిరంగ సభ కూడా జరగనున్న నేపథ్యంలో సభాస్థలాన్ని కూడా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఎర్రబెల్లి అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఈ నెల 11వ తేదీన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు జిల్లాలోని అన్ని కార్యాలయాల సముదాయంగా నిర్మించిన కలెక్టరేట్ను ప్రారంభిస్తారని, జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, ఆ సమీపంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో మాట్లాడతారని తెలిపారు. వాటిని పరిశీలించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి అవసరమైన సూచనలు చేశామన్నారు.
సీఎం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆయా ఏర్పాట్లలో ఉమ్మడి జిల్లా మంత్రులమైన తాను, సత్యవతి రాథోడ్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మల్యేలు, జడ్పీచైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు అంతా కలిసి పాల్గొంటున్నామని మంత్రి వివరించారు.