హైదరాబాద్ : శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా స్మశాన వాటికలు, డంపింగ్యార్డులు, చెత్తను వేరు చేసే షెడ్ల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమాధానం ఇచ్చారు. రాష్ర్టంలో ఇప్పటి వరకు 8,001 స్మశాన వాటికలు, 12,301 డంపింగ్యార్డులు పూర్తి చేశామన్నారు. మిగిలిన వాటిని ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు స్మశాన వాటికల కోసం రూ. 1,554 కోట్ల 76 లక్షలు, డంపింగ్యార్డుల షెడ్ల కోసం రూ. 318 కోట్ల 99 లక్షలు ఖర్చు చేయడం జరిగిందన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామపంచాయతీలు అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. గాంధీ కలలుకన్న గ్రామస్వరాజ్యం టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నెరవేరుతుందన్నారు. ఒక్కో గ్రామపంచాయతీకి వైకుంఠధామం, నర్సరీ, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనంతో పాటు ట్రాక్టర్ మంజూరు చేశామన్నారు. స్మశాన వాటికలు 95 శాతం పూర్తయ్యాయి. గ్రామాల్లో పనులు ఎంత వరకు పూర్తయ్యాయి అనే అంశంపై ఎమ్మెల్యేలు సమీక్ష చేయాల్సిన అవసరం ఉందన్నారు. స్మశాన వాటికలకు నీటి కొరత ఉంటే.. బోర్లు వేసేందుకు అనుమతులు కూడా ఇచ్చామన్నారు. స్మశాన వాటికలను వినియోగంలోకి తెచ్చేందుకు ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలన్నారు.
గ్రామపంచాయతీలకు అందించిన ట్రాక్టర్లను పూర్తిస్థాయిలో చెత్తను తరలించేందుకు వినియోగించాలన్నారు. నర్సరీల్లో అన్ని రకాల మొక్కలను పెంచుతున్నామని తెలిపారు. గ్రామాల్లో 23 కోట్ల మొక్కలు నాటామని, వాటిని కాపాడే ప్రయత్నం చేయాలన్నారు. పల్లె ప్రగతిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగా పాలు పంచుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.