వరంగల్ : జిల్లాలోని రాయపర్తి మండలంలో గల సాంఘిక సంక్షేమ పాఠశాలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్న మంత్రి, రాయపర్తిలో ఆగారు.
ఈ సందర్భంగా మంత్రి ముందుగా పాఠశాల నిర్వహణ తీరును పరిశీలించారు. ఉపాధ్యాయులతో మాట్లాడారు. స్కూల్లో అందిస్తున్న విద్యా బోధన, భోజన వసతి, హాస్టల్ సదుపాయాలు ఎలా ఉన్నాయో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి మంత్రికి విద్యార్థులు వివరించారు. దీంతో మంత్రి వారిని అభినందించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి బోధన అందించాలన్నారు.
ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో నిర్లక్ష్యం వహించవద్దని అదేశించారు. ప్రభుత్వ పాఠశాలలకు మంచి పేరు తేవాలని చెప్పారు. విద్యార్థులు కూడా విద్యా బుద్ధులు నేర్చుకొని, ఉన్నత స్థాయికి చేరుకోవాలని, తల్లితండ్రులు, ఉపాధ్యాయుల పేరు నిలబెట్టాలని సూచించారు.