వరంగల్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి దమ్ముంటే ధాన్యం కొనుగోలుపై ఢిల్లీలో పోరాటం చేసి తెలంగాణ రైతులకు ధైర్యం చెప్పాలని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. వడ్ల కొనుగోలు విషయం లో సీఎం కేసీఆర్పై పిచ్చి వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. బుధవారం ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డితో కలిసి హనుమకొండలోని తన నివాసంలో మంత్రి మీడియాతో మాట్లాడా రు. వానకాలంలో రైతులు పండించిన చివరి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
యాసంగి వడ్ల కొనుగోలుపై కేంద్రం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వచ్చి నా, రైతులకు ఇబ్బందులు కలుగకూడదనే ఉద్దేశంతో తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తున్నామని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పాలనలో ఉన్న ఛత్తీస్గఢ్లో 20 శాతం ధాన్యం కూడా కొనడం లేదని.. అక్కడి రైతులు వరంగల్ ఉమ్మడి జిల్లాకు తీసుకొచ్చి వడ్లు అమ్ముతున్నారని గుర్తుచేశారు.
యాసంగి వడ్ల కొనుగోలుపై కేంద్రం రెండు నాలుకల ధోరణితో మాట్లాడుతున్నదని మంత్రి ఎర్రబెల్లి విమర్శించారు. రైతుల నుంచి ఏ రకమైన ధాన్యాన్ని ఎంత మేరకు కొనుగోలు చేస్తారో కేంద్రం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనబోమని కేంద్రం చెప్తుంటే.. రాష్ట్రంలోని బీజేపీ నాయకులు యాసంగిలో వరి వేయాలని రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ నాయకుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి రైతులు కాదని.. వారికి రైతుల సమస్యలు తెలియవని దుయ్యబట్టారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతకైనా సిద్ధంగా ఉన్నదని చెప్పారు.
కేంద్రం నుంచి హామీ రాకున్నా, ఎంత నష్టం వచ్చినా రైతులు ఇబ్బందులు పడొద్దని సీఎం కేసీఆర్ వానకాలం ధాన్యం కొనుగోలు చేస్తున్నారని స్పష్టంచేశారు. బీజేపీ నేతలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రైతు వ్యతిరేక చట్టాలపై ప్రధాని మోదీ క్షమాపణలు కోరినా.. రాష్ట్ర బీజేపీ నాయకులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పోరాటం ఫలితంగా వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్న మోదీ.. ఎంఎస్పీ, కరెంటు చట్టాలను సైతం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విషయంలో కేంద్రం వివక్ష చూపడంతోపాటు రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నదని మంత్రి ఆరోపించారు.