వరంగల్, జనవరి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మంలో బీఆర్ఎస్ నిర్వహించిన భారీ బహిరంగ సభతో ప్రతిపక్ష పార్టీలు భయపడుతున్నాయని పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఈ సభతో బీజేపీ, కాంగ్రెస్ వెన్నులో వణుకు పుట్టిందని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలతో పాలన సాగించిన కాంగ్రెస్ ఇప్పటికే దేశంలో అడ్రస్ లేకుండా పోయిందని, ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీ భరతం పట్టడం ఖాయమని చెప్పారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, పెద్దిసుదర్శన్రెడ్డి, నన్నపునేని నరేందర్, గ్రేటర్ నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి మంత్రి దయాకర్రావు గురువారం హనుమకొండలో మీడియాతో మాట్లాడారు. ‘నలభై ఏండ్ల రాజకీయ జీవితంలో నేను చూసిన అనేక సభల్లో ఖమ్మం అద్భుతమైనది. ఈ సభ కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతమైంది. జాతీయ నాయకుల రాకతో బీఆర్ఎస్కు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తున్నది. నిన్నటి సభను దేశ ప్రజలు ఆసక్తిగా చూశారు. కేసీఆర్ దేశానికి అవసరమని దేశ ప్రజలంతా భావిస్తున్నారు. దేశంలో రైతుకు న్యాయం చేసే ఏకైక నాయకుడు కేసీఆర్ అని నమ్ముతున్నారు. లక్ష్యానికి మించి ఖమ్మం సభకు ప్రజలు తరలి వచ్చారు. కేసీఆర్ ప్రసంగాన్ని ఎంతో ఆసక్తితో విన్నారు’ అని మంత్రి పేర్కొన్నారు.
దేశాన్ని పాలించే సత్తా కేసీఆర్కే..
దేశాన్ని పాలించే సత్తా ఒక కేసీఆర్కే ఉన్నదని ఎర్రబెల్లి తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లోని అభివృద్ధి, సంక్షేమంపై, తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలపై చర్చకు సిద్ధమా? మిషన్ భగీరథ మీద చర్చకు వస్తారా? గ్రామాల అభివృద్ధిపై వస్తారా? అని మంత్రి సవాల్ విసిరారు. తాము దేశమంతా ఉచిత కరెంట్ ఇస్తామంటే, ప్రతిపక్షాలకు ఎందుకు కండ్ల మంట? అని ప్రశ్నించారు. దేశంలో దళితబంధు అమలు చేస్తామంటే జీర్ణించుకోలేక పోతున్నారని మండిపడ్డారు. దేశమంతా సీఎం కేసీఆర్ను ఆదర్శంగా తీసుకుంటుంటున్నారని, కంటి వెలుగును తమ రాష్ర్టాల్లోనూ అమలు చేస్తామని ఖమ్మం సభలోనే పలువురు సీఎంలు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు.
బండికి మెదడు లేదు..
బండి సంజయ్కి ఇంతకాలం తల మీద వెంట్రుకలే లేవనుకున్నానని, ఇప్పుడు మెదడు కూడా లేదని తెలుస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. ఖమ్మం సభకు లక్షలమంది జనం వచ్చింది కనిపించలేదా? అని ప్రశ్నించారు. తొండి సంజయ్కి 24 గంటల కరెంటు గురించి సందేహాలు ఉంటే ఎకడైనా కరెంటు తీగను పట్టుకుంటే తెలుస్తదని ఎద్దేవా చేశారు. ప్రధానిని ఆకాశానికి ఎత్తుతున్న కిషన్రెడ్డి కేంద్ర మంత్రిగా తెలంగాణకు ఏమి తెచ్చాడో చెప్పాలని, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకురాలేని వారు తెలంగాణ సాధించిన కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ను ఓడించడానికి వేరే వాళ్లు అవసరం లేదని, సొంత పార్టీ నేతలే చాలని అన్నారు. దయ్యాలు వేదాలు వల్లించినట్టు రేవంత్రెడ్డి నీతులు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో కాంగ్రెస్కు కాలం చెల్లిందని, బీజేపీ దేశానికి భారంగా మారిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని, వారి ఆటలు చెల్లవని ఖమ్మం సభ సందేశం ఇచ్చిందని అన్నారు. అంతకుముందు ఆయన జనగామ జిల్లా పాలకుర్తిలో మాట్లాడుతూ.. యావత్ దేశం సీఎం కేసీఆర్, తెలంగాణ వైపే చూస్తున్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, నరేంద్రమోదీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలు బీఆర్ఎస్కు మద్దతు పలకాలని ఆయన కోరారు.