సిబ్బంది, పరికరాలు, మందుల కొరత రావొద్దు
వైద్యాధికారులతో మంత్రి ఈటల
హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని వైద్యసిబ్బంది మరోసారి యుద్ధవాతావరణంలో పనిచేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు. ఇది గంభీరమైన సమయమని, ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని స్పష్టంచేశారు. గురువారం అన్ని జిల్లాల వైద్యాధికారులు, దవాఖానల సూపరింటెండెంట్లతో ఈటల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓవైపు ప్రజా జీవనం యథావిధిగా కొనసాగిస్తూనే మరోవైపు కరోనాను కట్టడిచేయాల్సి ఉన్నదని, అలసత్వం పనికిరాదని పేర్కొన్నారు.
అన్ని దవాఖానల్లో పీపీఈ కిట్లు, మాస్కులు, లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు, ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు, బెడ్స్ వంటి సదుపాయాల్లో కొరత రావొద్దని సూచించారు. డాక్టర్లు, వైద్యసిబ్బంది తగినంత సంఖ్యలో ఉండాలని, అవసరమైతే ఎంతమంది సిబ్బందినైనా తాత్కాలికంగా నియమించుకోవాలని ఆదేశించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో గ్రామస్థాయి వైద్యసిబ్బంది కీలకపాత్ర పోషిస్తున్నారని అభినందించారు. గ్రామాల్లో జ్వరం వచ్చిన ప్రతి ఒక్కరినీ, రోజూ పరిశీలించాలని స్పష్టంచేశారు. వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత లేదని, 45 ఏండ్లు పైబడిన వారందరూ టీకా కేంద్రాలకు వెళ్లేలా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. ఆర్టీపీసీఆర్ పరీక్షల సంఖ్య పెంచాలని, ప్రతి జిల్లాకు ఇచ్చిన టార్గెట్ మేరకు పనిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీహెచ్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.