హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): లెక్కలు, ఎక్కాలు రావు.. ఇంగ్లిష్లో వెరీ పూర్.. కనీసం మాతృభాషల్లో చదవలేక పోతున్నారు ఇదీ దేశవ్యాప్తంగా విద్యార్థుల చదువుల పరిస్థితి. కరోనా కారణంగా జరిగిన అభ్యసన నష్టాన్ని అంచనావేసేందుకు నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్ అలయన్స్ (నిసా) దేశవ్యాప్తంగా సెప్టెంబర్లోనిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
ప్రతి ముగ్గురిలో ఒకరు గణితంలో వెనుకబడిపోయారని, దేశంలో తీవ్ర అభ్యసన నష్టానికి కరోనా కారణమైందని సర్వే తేల్చింది. తెలంగాణసహా 17 రాష్ర్టాల్లో 1,502 విద్యార్థులపై ఈ సర్వేను నిర్వహించారు. 3, 5, 8 తరగతుల్లోని విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసి, నివేదికను రూపొందించారు. ఈ సర్వే నివేదికను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మంగళవారం హైదరాబాద్లో ఆవిష్కరించారు.
నిసాలో బడ్జెట్ స్కూళ్ల యాజమాన్యాలు సభ్యులుగా ఉండగా, తెలంగాణ రికగ్నైజ్డ్ ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (ట్రస్మా) సైతం భాగస్వామిగా ఉన్నది. నిసా తరఫున ట్రస్మా ఈ నివేదికను ప్రచురించి విడుదల చేసింది. కార్యక్రమంలో ట్రస్మా అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు, ప్రధాన కార్యదర్శి ఎస్ మధుసూదన్, సలహాదారులు డాక్టర్ ఈ ప్రసాద్రావు, కొమురయ్య, నాయకులు కే ఉమామహేశ్వర్రావు, ఎస్ బీరప్ప, శివరాత్రి యాదగిరి, ఎస్ జయసింహ తదితరులు పాల్గొన్నారు.
సర్వేలో వెల్లడైన ప్రధాన అంశాలు
అభ్యసనలోటు పూడ్చాలి
వచ్చే విద్యాసంవత్సరంలో అభ్యసన లోటును పూడ్చాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులంతా ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలి. చదువులను ఇంకా నిర్లక్ష్యం చేస్తే తరం మొత్తం నష్టపోయే ప్రమాదమున్నది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల పిల్లలే అధికంగా నష్టపోతున్నారు. పిల్లలు చదవడంలేదని తల్లిదండ్రులు వారిని నిందించవద్దు. ఇది పిల్లలు, తల్లిదండ్రుల తప్పిదం కాదు. కరోనా విపత్తు కారణంగానే ఇలా జరుగుతున్నది.
-బోయినపల్లి వినోద్కుమార్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు