Mid-air scare : హైదరాబాద్ (Hyderabad) నుంచి హుబ్లీ (Hubballi) వెళుతున్న ఫ్లై 91 విమానాన్ని బెంగళూరు (Bengalore) కు దారి మళ్లించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం గాల్లో ఉండగానే సాంకేతిక సమస్య (Technical Issue) ఎదురైనట్టు అధికారులు వెల్లడించారు. విమానాన్ని దారి మళ్లించాల్సిన పరిస్థితి వచ్చిందని, విమానంలోని ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నారని తెలిపారు.
కాగా ఆదివారం రోజు సాంకేతిక సమస్యలవల్ల విమానం మూడు గంటలపాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. కొందరు భయంతో బిగ్గరగా ఏడుస్తూ క్షేమంగా కిందకు దిగాలని ప్రార్థనలు చేశారు. ఆదివారం సాయంత్రం 3.30 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి ఫ్లై 91 (Fly91) బయలుదేరింది. అది 4.30 కు హుబ్లీ చేరుకోవాలి. కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో దాన్ని బెంగళూరుకు దారి మళ్లించారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు తెలిపారు.
ఆ తర్వాత విమానం సాయంత్రం 6.30 కు బెంగళూరు నుంచి తిరిగి ప్రారంభమైందని చెప్పారు. హుబ్లీ చేరుకునేసరికి రాత్రి 11 గంటలు అయ్యిందని, 22 మంది ప్యాసింజర్లు సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ఇదిలాఉండగా వాతావరణ పరిస్థితుల వల్ల ముంబై నుంచి కొల్హాపుర్కు వెళ్లాల్సిన మరో విమానాన్ని గోవాకు (Goa) మళ్లించారు. విమానంలో సమస్య ఏం లేదని, ఇందులోని ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని సంబంధిత అధికారులు తెలిపారు.