న్యూయార్క్, జనవరి 18: ప్రపంచవ్యాప్తంగా బహుళప్రాచుర్యం పొందిన ‘క్యాండీ క్రష్’ వీడియోగేమ్ను రూపొందించిన యాక్టివిజన్ బిజార్డ్ సంస్థను ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 68.7 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.5.12 లక్షల కోట్లు) కొనుగోలు చేసింది. వీడియోగేమింగ్ రంగంలో ఇదే అతిపెద్ద డీల్. ‘కాల్ ఆన్ డ్యూటీ’ ‘ఓవర్వాచ్’ వంటి పాపులర్ గేమ్స్ యాక్టివిజన్ లైబ్రరీలో ఉన్నాయి. ప్రస్తుతం అన్ని ప్లాట్ఫామ్స్పై గేమింగ్ అనేది ఉత్సాహవంతమైన వినోదసాధనంగా ఉందని, మెటావర్స్ ప్లాట్ఫామ్స్ను అభివృద్ధిపర్చడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుందని మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల చెప్పారు. కొవిడ్ కారణంగా వీడియోగేమ్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. యాక్టివిజన్ను కొనుగోలు చేయడంతో మైక్రోసాఫ్ట్కు చెందిన ఎక్స్బాక్స్…ఆదాయంలో మూడో పెద్ద గేమింగ్ కంపెనీగా ఆవిర్భవించి, వీడియో గేమింగ్లో పేరొందిన సోని ప్లేస్టేషన్కు పోటీనిస్తుంది. యాక్టివిజన్ షేరు శుక్రవారంనాటి ముగింపు ధరకు 45 శాతం ప్రీమియంతో 95 డాలర్ల చొప్పున మైక్రోసాఫ్ట్ ఆఫర్ చేసింది. సోమవారం అమెరికా మార్కెట్ సెలవుకాగా, మంగళవారంఈ షేరు 30 శాతం పెరిగి 86 డాలర్ల వద్దకు చేరింది.