న్యూఢిల్లీ, నవంబర్ 19: జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్..దేశీయ మార్కెట్లోకి కాంప్యాక్ట్ కారు ఏఎంజీ ఏ 45 ఎస్ 4 మాటిక్ + మోడల్ను పరిచయం చేసింది. దేశవ్యాప్తంగా ఈ కారు రూ.79.50 లక్షల ధరలో లభించనున్నది. 2 లీటర్ల టర్బోచార్జ్ ఇంజిన్ కలిగిన ఈ కారు 421 హెచ్పీల శక్తినివ్వనున్నది. కేవలం 3.9 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు గంటకు 270 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. ఈ సందర్భంగా మెర్సిడెజ్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో మార్టిన్ స్కేవెంక్ మాట్లాడుతూ..ఏ-క్లాస్ పరిధిని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ఈ నూతన మోడల్ను పరిచయం చేసినట్లు, ముఖ్యంగా భారత్లో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్లో మరింత వాటా సాధించడానికి వీలు పడనున్నదన్నారు. 2021లో దేశీయ మార్కెట్లోకి 15 మోడళ్ళను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ..దీంట్లో 13 మోడల్ ఈ సరికొత్త కారని పేర్కొన్నారు.