చండీగఢ్: హిజాబ్ అంశంపై సుప్రీంకోర్టు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై మళ్లీ అగ్గి రాజేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. బీజేపీ పాలిత హర్యానా రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తమను తాము నిగ్రహించుకోలేని పురుషులే హిజాబ్ ధరించమని మహిళలను బలవంతం చేస్తారని అన్నారు. ఈ మేరకు గురువారం ఒక ట్వీట్ చేశారు. ‘స్త్రీలను చూడగానే ఉద్వేగాన్ని అదుపు చేసుకోలేని పురుషులు హిజాబ్ ధరించమని మహిళలను బలవంతం చేస్తారు. వారి మనస్సును దృఢపరచుకోవడం అవసరం. కానీ స్త్రీలకు శిక్ష విధిస్తున్నారు. తల నుంచి కాలి వరకు కప్పుకోవాలని స్త్రీలను బలవంతం చేస్తున్నారు. ఇది తీవ్ర అన్యాయం’ అని హిందీలో ట్వీట్ చేశారు. పురుషులు తమ మనస్సులను దృఢపరచుకోవాలని, మహిళలను హిజాబ్ నుంచి విముక్తి చేయాలని ఆయన సూచించారు.
కాగా, బీజేపీ పాలిత కర్ణాటకలో స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థినులు హిజాబ్ ధరించడాన్ని నిషేధించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ముస్లిం బాలికలు, యువతులు వ్యతిరేకించారు. దీనిపై ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. కర్ణాటక విద్యా సంస్థల్లో హిజాబ్ ధారణపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని తొలగించేందుకు ఆ రాష్ట్ర హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఈ తీర్పును సుప్రీంకోర్టులో పలువురు సవాల్ చేశారు.
అయితే హిజాబ్ ధారణపై అత్యున్నత న్యాయస్థానం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. ఈ పిటిషన్లపై విచారణకు సముచితమైన ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరింది. ఈ పరిణామాల నేపథ్యంలో కర్ణాటకలో మరోసారి విద్యా సంస్థల వద్ద భద్రతను పెంచారు.