శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో ఉంటున్న నాన్ లోకల్స్కు ఓటింగ్ హక్కు కల్పిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆ రాష్ట్ర మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పీడీపీ చీఫ్ ముఫ్తీ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. జమ్మూకశ్మీర్ను ఓ ల్యాబ్లా వాడుతున్నట్లు ఆరోపించారు. జమ్మూకశ్మీర్లో ప్రయోగాలు నిర్వహించి, వాటిని ఇతర రాష్ట్రాల్లో బీజేపీ అమలు చేస్తోందని ఆమె విమర్శించారు. భారత్తో జమ్మూకశ్మీర్ను కలపాలన్న ఉద్దేశంతో బీజేపీ ఈ జిమ్మిక్కులు చేస్తోందని ఆమె ఆరోపించారు. బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ఒక్క కశ్మీరే కాదు, యావత్ భారత్ పరిస్థితి ఇలాగే ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో దాదాపు 25 లక్షల మంది
నాన్ లోకల్స్ ఓటు హక్కును వినియోగించే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సార్లు ఎన్నికల సమయంలో రిగ్గింగ్ జరుగుతుందని, కొన్ని సందర్భాల్లో ఎన్నికల తర్వాత కూడా రిగ్గింగ్ జరుగుతుందని, మహారాష్ట్రలో అలాగే జరిగిందని, ఇక ఈడీ లాంటి ఏజెన్సీలను ఆ రిగ్గింగ్ కోసం బీజేపీ వినియోగిస్తోందని, ఈడీ ఇప్పుడు బీజేపీ భాగస్వామిగా మారిందని ముఫ్తీ ఆరోపించారు.