హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 12 (నమస్తే తెలంగాణ): నమస్తే తెలంగాణ-నిపుణ, తెలంగాణ టుడే, 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం గ్రూప్-1, 2 పరీక్షలపై మెగా సెమినార్ నిర్వహించనున్నారు. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఉదయం 9.30 నుంచి 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణ ప్రదీప్ నేతృత్వంలో మెగా సెమినార్ జరుగనున్నది. సెమినార్లో ఇండియన్ జాగ్రఫీ ఫర్ మెయిన్స్కు సంబంధించిన ప్రశ్నలు, జవాబులతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. కార్యక్రమానికి తెలంగాణ గ్రూప్-1 ఆఫీసర్స్ అసొసియేషన్, డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్గౌడ్, నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ నవీన్చంద్ర, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి వంగీపురు హాజరవుతారని తెలిపారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్న నేపథ్యంలో నిరుద్యోగులకు ఉపయోగపడేలా ఈ సెమినార్లో నిపుణులు సలహాలు, సూచనలు చేయనున్నారు. పోటీ పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి, ఎలాంటి పుస్తకాలను చదవాలన్న అంశాలను వివరిస్తారు.