జోగులాంబ గద్వాల : రాష్ట్రంలోని అన్నివర్గాలకు అండగా నిలిచిన పార్టీ టీఆర్ఎస్సేనని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. గద్వాల నియోజకవర్గంలోని గట్టు, కేటీదొడ్డి, మల్దకల్ మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాల్గొని, మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావమై 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వరంగల్లో నిర్వహించే విజయగర్జన సభకు పార్టీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు.
గత పాలకుల నిర్లక్ష్యంతో ఈ ప్రాంతంలో అభివృద్ధిలో వెనుకబడిపోయిందన్నారు. రైతులు నీళ్లు, కరెంటు లేక ఎన్నో ఇబ్బందులుపడ్డారని గుర్తు చేశారు. నేడు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారన్నారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంటు, చివరి ఆయకట్టుకు సాగునీరు అందజేయడం జరుగుతుందన్నారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, మిషన్ భగీరథ తదితర ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు కొత్త వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టి రైతులకు నష్టం చేస్తున్నారని ఆరోపించారు.
అలాగే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 20 సంవత్సరాలైన సందర్భంగా నిర్వహిస్తున్న విజయగర్జన సభకు గద్వాల నియోజకవర్గంలోని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు వరంగల్కు బయలుదేరి, విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా ఎంపీపీ ఫోరం అధ్యక్షుడు విజయ్, పాక్స్ చైర్మన్ వెంకటేశ్, మండల శాఖ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు హనుమంతు నాయుడు పాల్గొన్నారు.