నమస్తే తెలంగాణ క్రీడా విభాగం: భారత ఫాస్ట్ బౌలింగ్ విభాగం అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసిరే రాజస్థాన్ యంగ్ పేసర్ అశోక్ శర్మ జింబాబ్వేతో తొలి టీ20 మ్యాచ్లో బరిలోకి దిగి అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి టీమిండియాకు ఆడే స్థాయికి ఎదిగిన 24 ఏండ్ల అశోక్ ప్రయాణం స్ఫూర్తిదాయకం. జైపూర్ సమీపంలోని రాంపూర్ అనే చిన్న గ్రామానికి చెందిన అశోక్ తండ్రి ఓ రైతు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఇద్దరు కుమారుల్లో ఒకరిని మాత్రమే క్రికెట్లో ప్రోత్సహించగల పరిస్థితి నెలకొంది.
దీంతో అశోక్ అన్న అక్షయ్ శర్మ (డిస్ట్రిక్ట్ లెవెల్ క్రికెటర్) తమ్ముడి కల కోసం తన ఆటను పక్కనబెట్టాడు. కుటుంబం చేసిన త్యాగానికి తగ్గట్టుగానే అశోక్ కష్టపడి జాతీయ స్థాయికి ఎదిగాడు. 2025-26 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతను సంచలన ప్రదర్శన చేశాడు. 10 మ్యాచుల్లోనే 22 వికెట్లు పడగొట్టి టోర్నీ టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు.
ఈ ప్రదర్శనతో 2026 ఐపీఎల్ వేలంలో గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ రూ. 90 లక్షలకు దక్కించుకుంది. జీటీ హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రా గైడెన్స్లో మరింత మెరుగైన అశోక్ పదునైన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ధ్రువ్ జురెల్కు 154.2 కి.మీ. వేగంతో బంతిని విసిరి 2026 సీజన్లోనే ఫాస్టెస్ట్ బౌలర్గా నిలిచాడు. అశోక్ ప్రతిభను, పదునైన పేస్ను గుర్తించిన సెలెక్టర్లు ఈ టూర్కు ఎంపిక చేయగా.. కెప్టెన్ అయ్యర్ తొలి మ్యాచ్లోనే అతనికి చాన్స్ ఇచ్చాడు. ఈ పోరులో అశోక్ వికెట్ తీయకపోయినా 140 కి.మీ ప్లస్ పేస్తో ఫర్వాలేదనిపించాడు.