పటాన్చెరు, జనవరి 21 : జలమండలి ఎండీ దానకిశోర్ను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి శుక్రవారం హైదరాబాద్లోని జలమండలి కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా తాగునీటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అమీన్పూర్, బొల్లారం, తెల్లాపూర్ మున్సిపాలిటీలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తాగునీరు అందజేయడం మున్సిపాలిటీలకు సవాల్గా మారిందని వివరించారు. ఇప్పటి వరకు ప్రతిపాదించిన రిజర్వాయర్లను త్వరతిగతిన పూర్తిచేయాలని కోరారు. తెల్లాపూర్ మున్సిపాలిటీలో వేల రూపాయల బిల్లులు చెల్లించాలని నోటీసులు జారీ చేస్తున్నారని ఎమ్మెల్యే ఎండీ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యను సానుకూలంగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజలకు మెరుగైన సేవలందించాలని తాము కోరుకుంటున్నామని, అధికారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. శరవేగంగా పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని జలమండలి యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు. తాము సూచించిన పనులపై జలమండలి ఎండీ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు. ఆయన వెంట నాయకులు సోమిరెడ్డి, బి.వెంకట్రెడ్డి పాల్గొన్నారు.