హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): మెడికల్ టూరిజానికి హైదరాబాద్ గ్లోబల్ హబ్గా మారుతున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. శుక్రవారం గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్ను హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ డీ నాగేశ్వర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నగరంలో అత్యాధునిక వైద్యసౌకర్యాలతో కూడిన అడ్వాన్స్డ్ సెంటర్లు ఉన్నాయని, ఇక్కడ క్లినికల్ రిసెర్చ్ కూడా జరుగుతున్నదని వెల్లడించారు. రోగుల ఆరోగ్య సంరక్షణకు హైదరాబాద్ ఒక బెంచ్మార్క్ను సృష్టిస్తున్నదని శ్లాఘించారు. రోగుల చికిత్స విషయంలో డాక్టర్ నాగేశ్వర్రెడ్డి నిబద్ధతను చూసి తాను ప్రేరణ పొందానని వివరించారు. అత్యాధునికమైన, వినూత్న టెస్టింగ్ సౌలభ్యం ఉన్న ఏఐజీ వంటి దవాఖానలు హైదరాబాద్లో ఉండటం గర్వకారణమని కొనియాడారు. డాక్టర్ నాగేశ్వర్రెడ్డి మాట్లాడుతూ జీవనశైలితో కలిగే రుగ్మతలపై అధ్యయనం చేస్తున్నామని, ఈ క్రమంలో అత్యాధునిక వ్యాధి నిర్ధారణ పద్ధతులతో వెల్నెస్ సెంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చామని వెల్లడించారు. ఇందులో డీఎన్ఏను సైతం విశ్లేషించవచ్చని తెలిపారు. దీనికోసం జీనోమిక్ టెక్నాలజీ వంటి అత్యాధునిక పద్ధతులను అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు.