సుల్తాన్బజార్,మే12: హైదరాబాద్ కోఠిలోని ప్రభుత్వ చెవి, ముక్కు, గొంతు వ్యాధుల దవాఖానలో అరుదైన శస్త్ర చికిత్సను నిర్వహించి పదేళ్ల బాలుడికి పునరుజ్జీవం పోశారు. ఈ మేరకు గురువారం దవాఖానలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ టి శంకర్ మాట్లాడుతూ మెదక్ జిల్లా నారాయణ్ఖేడ్ గ్రామానికి చెందిన పదేళ్ల సుఫియాన్ చావూషా ఆరేండ్ల కిందట ఒక దుర్ఘటనలో తన తండ్రిని కోల్పోయాడు. అదే సమయంలో సుఫియాన్ తలకు బలమైన గాయం కావడంతో స్పృహ కోల్పోయి నెల పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డాడని అన్నారు. ఈ క్రమంలో ఈఎన్టీ దవాఖానాను ఆశ్రయించగా ప్రొఫెసర్ డాక్టర్ సంపత్కుమార్సింగ్ పూర్తిగా పరిశీలించి శ్వాస నాళం స్వరపేటిక కింద కుచించుకుపోయి ఒక రంధ్రం (ట్రకియాస్టమీ)శస్త్ర చికిత్స ద్వారా శ్వాసను తీసుకునే వెసులుబాటు కల్పించారు.
శ్వాసనాళం గొట్టం తొలిగించడానికి కుటుంబం కోరడంతో విడతల వారీగా శ్వాసనాళాన్ని విడుదల చేసి ట్రకియాస్టమీ శ్వాస నాళ గొట్టాన్ని తొలిగించి స్వ యంగా శ్వాస తీసుకునే విధంగా చేసిన ప్రయ త్నం సఫలీకృతమైందన్నారు. ఇది అరుదైన శస్త్ర చికిత్స ఫలితమని ఆయ న పేర్కొన్నారు. ఈ చికిత్సతో బాలుడు సహజంగా శ్వాస తీసుకోవడంతో పాటు మాట్లాడటానికి అవకాశం దొరికిందన్నారు. బాలుడికి అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించి పునరుజ్జీవం చేసిన డాక్టర్ సంపత్కుమార్, డాక్టర్ హమీద్, డాక్టర్ మహేశ్వర్రెడ్డి, డాక్టర్ దుర్గాప్రసాద్లను సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ ప్రత్యేకంగా అభినందించారు.