మెదక్రూరల్, మార్చి14: వస్తు వినిమయ వ్యవస్థలో వినియోగదారుడే రారాజు. వస్తు సేవల్లో నాణ్యత కొరవడినా, నష్టపోయినా పరిహారాన్ని పొందవచ్చు. ఎలాంటి రుసుం లేకుండా వినియోగదారుల ఫోరంలో కేసు వేయవచ్చు. కొనే ప్రతి వస్తువులోనూ సేవా లోపం లేకుండా సరైన ధర, తూకం, నాణ్యత, స్వచ్ఛత కలిగినవి పొందే హక్కు వినియోగదారులకు ఉంది. కానీ ప్రస్తుత కాలంలో మోసాలు ఎక్కువై పోయాయి. చివరికి మనం తాగే పాలు, నీళ్లలో కూడా నాణ్యత లేకుండాపోయింది. తూకాల్లో భారీగా తేడాలు ఉంటున్నాయి. వీటిపై ఎవరైనా ప్రశ్నించినా, నిలదీసినా న్యాయం జరగడంలేదు. ఈ తరహా మోసాలను అరికట్టాలంటే వినియోగదారుడు మేల్కోవాలి. తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలి. ప్రపంచ వినియోగదారుల దినోత్సవం 1962న మార్చి 15న అమల్లోకి వచ్చింది. నేడు ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భగాప్రత్యేక కథనం..
వినియోగదారుల హక్కులు
వినియోగదారుల హక్కులు గుర్తించిన అమెరికా అధ్యక్షుడు జాన్ కెనడి 1962 మార్చి 15న ప్రపంచ వినియోగదారుల హక్కులను ప్రకటించారు. దీన్ని పురస్కరించుకుని 1983 నుంచి ప్రతి ఏడాది మార్చి 15న ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. మనదేశంలో వినియోగదారుల హక్కుల పరిరక్షణకు 1986లో రూపొందించిన చట్టం డిసెంబర్ 24, 1987 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. వినియోగదారుల సౌలభ్యం కోసం వివిధ స్థాయిలో కమిషన్లు ఏర్పాట్లు చేశారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో కమిషన్లు పని చేస్తున్నాయి. ఫోరమ్ స్థానంలోనే జిల్లా, జాతీయ వినియోగదారుల కమిషన్గా పనిచేస్తున్నాయి.
నూతన చట్టంలోని అంశాలు
ఒక వస్తువును ఏ ప్రదేశంలో కొనుగోలు చేసినా, తాము నివాసముంటున్న న్యాయస్థానంలో ఫిర్యాదు చేసుకోవచ్చు. జిల్లా వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత ఫిర్యాదుదారుడు, ప్రతివాదుల మధ్యవర్తిత్వం నడిపి పరిష్కరించడానికి కృషి చేస్తారు. జిల్లావినియోగదారుల కమిషన్ తీర్పును 45 రోజుల లోపల రాష్ట్ర కమిషన్కు అప్పీలు చేసుకోవచ్చు. జిల్లా కమిషన్ తీర్పును అనుసరించి వ్యాపారి, విక్రయదారుల ఆస్తులు జప్తు చేసే అధికారం ఉంటుంది. టైప్ లేదా రాత పూర్వకంగా ఫిర్యాదు చేసుకోవచ్చు. వస్తువులను అమ్మినవారు, డీలర్, ఉత్పత్తిదారులు ఇందులో బాధ్యులవుతారు.
కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ
జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వినియోగదారుల కమిషన్ తోడుగా కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ చట్టంలో ఉన్న ముఖ్యమైన భాగం ఆన్లైన్, ఈ మొయిల్ ద్వారా నేరుగా సంస్థలో ఫిర్యాదు చేసుకోవచ్చు. పరిష్కరించిన కేసును జాతీయ కమిషన్లో మాత్రమే అప్పీల్కు అవకాశం ఉంటుంది. జిల్లా, రాష్ట్ర, జాతీయ కమిషన్లతో సంబంధం లేకుండా సంస్థలో ఫిర్యాదుకు ఏర్పాట్లు చేశారు. టోల్ఫ్రీ నంబర్ 18004252233, 7330774444 లేదా ఉమ్మడి జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సంగారెడ్డి కార్యాలయం, 08455295654లో సంప్రదించవచ్చు .
వినియోగదారుల బాధ్యతలు, పాటించాల్సినవి
ప్రతి వినియోగదారుడు నాణ్యమైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేసేలా ఎంచుకోవాలి. తమకు అవసరమైన వస్తువులను మాత్రమే కొనాలి. కొనే వస్తువు గురించి సమాచారాన్ని సేకరించాలి. అధీకృత డీలర్ల నుంచి వస్తువు కొనుగోలు చేయాలి. ఈ క్రమంలో తయారీ, తేదీలను గమనించాలి. మోసపూరిత ప్రకటనలపై జాగ్రత్తలు వహించాలి. కొనుగోలు చేసినప్పుడు తప్పకుండా రశీదును అడిగి తీసుకోవాలి. వస్తువు విషయంలో గ్యారంటీ/ వా రంటీ కార్డును షాపు య జమాని సంతకం, ముద్ర తో సహా తీసుకోవాలి. ఇవి వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు చేసేందుకు ఉపయోగపడుతాయి. జిల్లాలోని విద్యా సంస్థలు, గ్రామా ల్లో ప్రజలను చైతన్యపర్చడానికి చైతన్య వినియోగదారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. వినియోగదారుడికి అండగా నిలిచి సలహాలు సూచనలు అందజేస్తారు.
తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి
వినియోగదారుడు వస్తువును కొనుగోలు చేసే ముందు అ వస్తువు నాణ్యతను పరిశీలించి కొనాలి. వస్తువు కొనేటప్పుడు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి. అప్పుడే సమస్య పరిష్కరించుకోవడానికి సులువుగా ఉంటుంది. వినియోగదారులు నాసిరకం వస్తువులపై, మోసపూరిత వ్యాపారులపై వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించడానికి వెనుకాడవద్దు. ప్రతిఒక్కరూ తమకున్న హక్కుల గురించి తెలుసుకుని, మోసాలబారిన పడకుండా జాగ్రత్త వహించాలి. జిల్లాలో అవగాహన సదస్సులు నిర్వహించాలి. సలహాలు సూచనలకు జిల్లా వియోగదారుల సమాచార కేంద్రం 9908948242 సంప్రదించవచ్చు.
– డాకురి వెంకటేశం, జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం కన్వీనర్, మెదక్