అక్కన్నపేట, మార్చి 7 : మహిళ సబలగా, సాహసిగా మారుతున్నది. కష్టాలను భయపడకుండా ఎదుర్కొంటున్నది. కన్నీళ్లు పెట్టుకోవడం కాదు.. కన్నెర్రజేస్తున్నది. పిరికితనం వదిలి పిడికిలి బిగిస్తున్నది. నేల వైపు తలవాల్చి నడవడం కాదు.. నింగికి నిచ్చెనవేస్తున్నది. ఆకాశంలో సగమై, అవనిలో అర్థభాగమై నడుస్తున్నది. అన్ని రంగాల్లో రాణిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నది.
మహిళ దినోత్సవ నేపథ్యం..
1908 మార్చి 8న న్యూయార్క్లోని రిడ్చర్ స్క్వేర్ వద్ద వేలాది మంది కుట్టు పని చేసే మహిళా కార్మికులు పని గంటల కోసం, ఓటు హక్కు కోసం కదం తొక్కారు. ఈ పోరాటం అప్పట్లో అతి పెద్దది. కాగా, మహిళల్లో ఉత్సాహం నింపింది. 1910లో డెన్మార్క్లోని కోపెన్హగెన్లో అంతర్జాతీయ సోషలిస్టు మహిళ సదస్సు జరిగిన అనంతరం ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా రోజుగా, మహిళల హక్కుల దీక్షా రోజుగా నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటి నుంచి పలు దేశాలు మహిళ దినోత్సవాన్ని గుర్తించినా, భారతదేశంలో మాత్రం 1975 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా గుర్తించారు. దేశంలో మహిళలపై జరుగుతున్న లైంగికదాడులు, దోపిడీ, దౌర్జన్యాలు, వరకట్నానికి వ్యతిరేకంగా ఈ దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు.
ఇంట్లో అదనపు వరకట్నం కోసం హింసించే భర్త, అత్తింటివాళ్లు.. పాఠశాల, కళాశాలలో ప్రేమ పేరిట విసిగించే పోకిరీలు.. అదను చూసి కాటేసే కామాంధుడు.. పని చేసే చోట మానసికంగా వేధింపులు.. మరి ఈ అకృత్యాలకు అంతం లేదా? మగువకు రక్షణ లేదా? అంటే రాజ్యాంగంలో ఎన్నో చట్టాలు. ఐపీసీలో మరెన్నో సెక్షన్లు ఉన్నాయి. వాటి పై చైతన్యం లేకపోవడమే మహిళల పాలిట శాపంగా మారింది.
వరకట్న నిషేధ చట్టం-1961
భర్త, అతని తల్లిదండ్రులు, ఆడపడుచులుగానీ అత్తింటి తరఫు బంధువులెవరైనా వరకట్నం కోసం వేధిస్తే ఐదేండ్లకుపైగా జైలు, రూ.15వేలకు తక్కువ కాకుండా జరిమానా విధిస్తారు. ఈ చట్టం ప్రకారం కట్నం ఇవ్వడం, తీసుకోవడం రెండూ నేరమే. వరకట్నం వేధింపులకు సంబంధించి మహిళలు నేరుగా సంబంధింత పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. ఈ కేసులపై మొదటి శ్రేణి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణ జరిపి శిక్షలు ఖరారు చేస్తుంది.
ర్యాంగింగ్ నిరోధక చట్టం-1997
ఉమ్మడి రాష్ట్రంలో విద్యాసంస్థలో ర్యాగింగ్ను నిషేధిస్తూ ప్రభుత్వం 1997లో ర్యాగింగ్ నిరోధక చట్టం నంబర్ 28న తెచ్చింది. ఇందుకోసం జాతీయస్థాయిలో హెల్ప్లైన్లు ఏర్పాటు చేశారు. 1800 18022 18055కు ఫోన్ చేసి సమస్య చెప్పవచ్చు. ర్యాగింగ్ నిర్మూలనకు కళాశాలో కమిటీలు ఏర్పాటు చేసుకునే వీలు కల్పించారు. ర్యాగింగ్కు పాల్పడినట్లు రుజువైతే ఆరు నెలల నుంచి పదేండ్ల వరకు జైలు శిక్షతో పాటు కఠిన చర్యలు తీసుకుంటారు.
గృహహింస నిరోధక చట్టం -2005
ఇండ్లలో మహిళలపై జరిగే మానసిక, శారీరక హింసను అరికట్టేందుకు భారత ప్రభుత్వం 2005లో ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. చట్టప్రకారం శారీరకంగా, లైంగికంగా, మానసికంగా మహిళలకు హాని కలిగించడం, భావోద్వేగపూరిత మాటలతో దూషించడం, వరకట్న కోసం వేధించడం, హింసించడం, ఆమె ఆస్తులను స్వాధీనపర్చుకోవాలని చూడడం, ఆమెకు సంబంధించిన వ్యక్తిని లొంగదీసుకోవడం ఆమె తరఫు వారిని బెదిరించడం లాంటివన్నీ నేరాలే. బాధితురాలు లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందుతుంది. ఒకవేళ అడిగితే షెల్టర్ హోంలో రక్షణ కల్పించాలని సెక్షన్ -8 చెబుతున్నది. నేరం రుజువైతే ఏడాది జైలు, రూ. 20 వేల జరిమానా లేదా రెండు విధించవచ్చు.
ఆడపిల్లలను కాపాడుకుందాం..
పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తే చాలు కడుపులోనే చిధిమేస్తున్నారు. విద్యావంతులైన తల్లిదండ్రులు కూడా ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. జిల్లా ఆరోగ్య, వైద్య శాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో ఐదేండ్లలోపు 87478 మంది ఉండగా, ఇందులో 45891మంది బాలురు 41587 మంది బాలికలున్నారు. క్రమంగా బాలికల సంఖ్య పడిపోతుంది. లింగ నిర్ధారణ పరీక్షలు నిషేధించినా దొంగచాటుగా కొనసాగుతున్నాయి.
స్త్రీ రక్షణగా పలు లీగల్ సెక్షన్లు..
ఐపీసీ 304-బీ: వరకట్న మరణాల కింద కేసు నమోదు చేస్తారు. నేరం రుజువైతే ఏడేండ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష విధిస్తారు.
ఐపీసీ 306 : ఇతరుల ప్రోద్బలంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంటే కారకులపై ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. సెషన్స్ కోర్టు ద్వారా విచారణ జరుపుతారు. నేరం రుజువైతే పదేండ్ల జైలు శిక్ష ఉంటుంది.
ఐపీసీ 376 : మహిళ మతిస్థితిమితం సరిగ్గా లేకున్నా, మత్తులో ఉన్నా, మత్తుమందు ఇచ్చినా, బలవంతంగా గానీ, బెదిరించి గానీ లైంగికదాడి చేస్తే, ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. పదేండ్ల జైలు, జరిమానా విధిస్తారు.
ఐపీసీ 376 ఏ: ప్రభుత్వోద్యోగి తన దగ్గర పని చేస్తున్న మహిళలపై, అతడి ఆధీనంలో ఉన్న మహిళలపై లైంగికదాడికి దిగితే ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. పదేండ్ల జైలు, జరిమానా విధిస్తారు.
ఐపీసీ 376 సీ: జైలులో ఉన్న మహిళా ఖైదీలపై గానీ, ఆధీనంలో ఉన్న మహిళలపై సిబ్బంది లైంగికదాడి చేస్తే ఈ సెక్షన్ కింద శిక్ష వేస్తారు.
ఐపీసీ 376 డీ: దవాఖానలో పని చేసే మహిళా సిబ్బందిపై లైంగికదాడి చేస్తే ఈ సెక్షన్ కింద ఐదేండ్ల జైలు శిక్ష విధిస్తారు.
ఐపీసీ 494: భార్య బతికుండగానే మరొకరిని పెళ్లి చేసుకుంటే ఈ సెక్షన్ కేసు నమోదు చేసి విచారణ జరుపుతారు.
ఐపీసీ 496: వివాహితలను ఆమె భర్త లేదా బంధువుల గానీ శారీరకంగా, మానసికంగా హింసిస్తే ఈ సెక్షన్ కింద శిక్షార్హులు. మూడేండ్ల జైలు, జరిమానా విధిస్తారు.
ఐపీసీ 509: స్త్రీత్వానికి అవమానం కలిగిస్తూ మాట్లాడిన, సైగలు చేసినా, ఏదైనా వస్తువును ప్రదర్శించినా ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. నేరం రుజువైతే ఏడాది జైలు లేదా జరిమానా విధిస్తారు.
స్త్రీత్వం.. పంచభూతత్వం..
ఆమె మనోసాగరంలో పడవలా తేలిపోతు ఆశయసాధనలో ఓలలాడూతూ కామ పిశాచాలను కడలిలో ముంచుతుంది.
సహనంలో భూదేవియై అన్ని భరిస్తూ దుర్మార్గుల పాలిట భూకంపాలను సృష్టిస్తుంది.
ఆమె అందరికీ ఊపిరియై, ప్రాణాలు నిలబెడుతూ మానవ మృగాలలో సుడిగుండాలు రేపుతూ గాలిలో కలుపుతుంది.
ఆమె అగ్నియై క్షుత్తుతీర్చి జఠరాగ్నిని తృప్తిపరుస్తూ మదమెక్కిననోళ్లాను మంటల్లో కలుపుతుంది.
ఆమె ఆకాశమంతానిండి అందనంత ఎత్తుకెదిగినా అందరికీ చేరువులోవుంటూ దుష్టచతుష్టయాలను దునుమాడుతూ సాక్షిగా నిలుస్తుంది. పంచభూతాలు తానైనిండి, అవనిని పాలిస్తుంది..
ప్రతీ పాఠశాల, కళాశాలల్లో అవగాహన కల్పించాం
బాలికలు, మహిళా చట్టాల గురించి అన్ని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థినులకు అవగాహన కల్పించాం. అపరిచిత వ్యక్తులతో ఎలా వ్యవహరించాలో ప్రాక్టికల్గా కూడా వారికి వివరిస్తున్నాం. ఆడపిల్లలను నా వంతుగా రక్షణ కల్పిస్తూ పని చేయడం ఎంతో గర్వంగా ఉంది. గజ్వేల్తోపాటు సిద్దిపేట, హుస్నాబాద్లో కూడా మా షీటీం బృందాలు పటిష్టంగా పని చేస్తున్నాయి. మా కార్యక్రమాలు బాలికల్లో ధైర్యంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాయి.
– శ్రావణి, కానిస్టేబుల్, గజ్వేల్
అడ్డగూడి ఉమాదేవి,తెలుగు అధ్యాపకురాలు, చేర్యాల
(మహిళా డిగ్రీ గురుకుల కళాశాల సిద్దిపేట)
9908057980