మెదక్, అక్టోబర్ 28 : ఆసరా పింఛన్లు (వృద్ధాప్య) మంజూరుకు దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. అర్హులైన వారందరూ మీ సేవ కేంద్రాల్లో గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అయితే, కొత్తగా వృద్ధాప్య పింఛన్ మంజూరు కోసం ఆగస్టులో ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. తాజాగా ఆ గడువును పొడిగించడంతో మరికొంతమందికి అవకాశం వచ్చింది.
జిల్లాలో 16,691 దరఖాస్తులు..
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య పింఛన్ అర్హత వయస్సును 57 ఏండ్లకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు నెలలో పింఛన్ మంజూరుకు 57 ఏండ్లు నిండిన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించింది. మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలతో పాటు 21 మండలాల పరిధిలో 16,691 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు జిల్లా అధికారులు సైతం వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. ఇదిలా ఉండగా, ఆగస్టు నెల లో చాలా మంది వృద్ధాప్య పింఛన్ అర్హత కలిగిన వారు దరఖాస్తులు చేసుకోలేకపోయారని ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకెళ్లగా, సీఎం ఆదేశాలతో సమీక్ష నిర్వహించిన సీఎస్ దరఖాస్తు తేదీలను పొడిగించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలి
వృద్ధాప్య పింఛన్ల కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లాలో ఇప్పటి వరకు 16వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తులను పరిశీలిస్తాం.
-శ్రీనివాస్, డీఆర్డీవో, మెదక్
మెదక్ జిల్లాలోని మండలాల వారీగా దరఖాస్తులు
మండలం దరఖాస్తులు
అల్లాదుర్గం 543
చేగుంట 928
చిలిపిచెడ్ 472
హవేళీఘనపూర్ 976
కౌడిపల్లి 919
కొల్చారం 840
మనోహరాబాద్ 456
మాసాయిపేట 267
మెదక్ 1480
నర్సాపూర్ 733
నార్సింగి 460
నిజాంపేట 759
పాపన్నపేట 1498
రామాయంపేట 1053
రేగోడ్ 560
పెద్దశంకరంపేట 911
చిన్నశంకరంపేట 888
శివ్వంపేట 780
టేక్మాల్ 771
తూప్రాన్ 675
వెల్దుర్తి 722
మొత్తం 16,691