నిరుపేద కుటుబాలకు చెందిన పేద విద్యార్థుల బంగారు భవిష్యత్కు బాటలు వేసేందుకు ప్రభుత్వం నెలకొల్పిన గురుకులాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మారుమూల గ్రామాల విద్యార్థులు చదువుకు దూరం కావొద్దనే ఉదేశంతో ప్రభుత్వం గురుకులాలు ఏర్పాటు చేసి నిపుణులైన ఉపాధ్యాయులను నియమిస్తున్నది. నేడు ఉపాధ్యాయుల కృషితో ఎంతోమంది పేద విద్యార్థులు ఉన్నతస్థానాలకు ఎదుగుతున్నారు. గురుకులాల్లో చేరిన విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పిస్తూ వారిని విద్యలో రాణించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నది.
హత్నూర, నవంబర్ 25 : ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో నేడు ఎంతో మంది నిరుపేద విద్యార్థులు విద్య, క్రీడల్లో రాణిస్తూ బంగారు భవిష్యత్కు బాటలు వేసుకుంటున్నారు. విద్యార్థులు ఎంచుకున్న లక్ష్యానికి తోడు ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఉండడంతో లక్ష్యసాధన దిశగా అడుగులు వేస్తూ తల్లిదండ్రులు, విద్యనేర్పిన గురువులకు గుర్తింపు తెస్తున్నారు. మండల కేంద్రం హత్నూరలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ గ్రూపులు నిర్వహిస్తుండగా.. మొత్తం 297మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. విద్యలో రాణించాలంటే విద్యార్థులకు క్రమశిక్షణ, వ్యాయామం, క్రీడలు ఎంతో ముఖ్యం. నిత్యం కళాశాల క్రీడామైదానంలో విద్యార్థులకు క్రీడలు, వ్యాయామం నేర్పిస్తుండడంతో పాటు ఓవైపు చదువుకుంటూనే మరోవైపు క్రీడల్లో విద్యార్థులు రాణిస్తున్నారు అంతేకాకుండా కళాశాల ఉపాధ్యాయ బృందం సైతం విద్యార్థులకు ఆసక్తి ఉన్న ఆంశాలపై పట్టుసాధించేలా ప్రత్యేక కృషి చేస్తున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ వివేకానంద నిరంతరం విద్యార్థులను పర్యవేక్షించడంతో పాటు విద్యార్థులను అన్నిరకాలుగా ప్రోత్సహిస్తున్నారు. దీంతో చదువు, క్రీడల్లో రాణిస్తూ రాష్ట్ర, జాతీయస్థాయిలో విద్యార్థులు మంచి గుర్తింపును తెచ్చుకుంటున్నారు.
ప్రత్యేక తరగతులు…
కళాశాలలో చదువులో మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థులు 40మందిని ఎంపిక చేసి ఉదయం, సాయంత్రం వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా విద్యాబోధన చేస్తూ ప్రవేశపరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించడానికి కృషి చేశారు. రాష్ట్ర, జాతీయస్థాయిలో నిర్వహించిన పలుక్రీడల్లో రాణించి బహుమతులు పొందుతున్నారు.
నలుగురు పేద విద్యార్థులే…
జాతీయ స్థాయిలో నిర్వహించిన జేఈఈ, నీట్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన నలుగురు విద్యార్థులు నిరుపేద కుటుంబాలకు చెందినవారే. ఏనాడు నిరుపేదలమని దిగులు చెందకుండా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. విద్య, క్రీడల్లో రాణించి మంచి గుర్తింపును పొందడంతో పాటు వారి బంగారు భవిష్యత్కు బాటలు వేసుకుంటున్నారు. తల్లిదండ్రులు, విద్యనేర్పిన గురువులకు మంచి పేరును తీసుకువచ్చి తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు.
ముగ్గురు విద్యార్థులు వైద్య విద్యకు ఎంపిక..
ఇటీవల నిర్వహించిన (జేఈఈ మెయిన్స్)జాతీయస్థాయి వైద్య, విద్య కోర్సులో చేరడానికి కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు అర్హత సాధించారు. అందులో కళాశాలకు చెందిన విద్యార్థి సాయికుమార్ 539, తేజ 468, ప్రణయ్ 391 మార్కులు సాధించి వైద్యవిద్య కోర్సులో చేరడానికి అర్హత సాధించారు. కళాశాలకు చెందిన కార్తీక్ నీట్లో అర్హత సాధించి హర్యానాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ కోర్సులో చేరడానికి అర్హత సాధించాడు. లక్షల రూపాయలు వెచ్చించి చదువుకునే ధనిక కుటుంబాల విద్యార్థులు సాధించలేని విజయాలను అత్యున్నత విశ్వవిద్యాలయాల్లో చేరడానికి ఈ కళాశాలకు చెందిన నిరుపేద కుటుంబాల విద్యార్థులు సాధించడం కళాశాలకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.
చదువుతో పాటు క్రీడలూ ముఖ్యమే..
విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలూ ఎంతో ముఖ్యం. ఉదయం, సాయంత్రం విద్యార్థులకు వ్యాయామం, క్రీడలు నిర్వహిస్తూ మానసికోల్లాసం కలిగించేలా చర్యలు తీసుకుంటున్నాం. కళాశాలకు చెందిన ఎంతోమంది విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడలకు ఎంపికయ్యారు. ఎన్నో విజయాలు సాధించి కళాశాలకు మంచి గుర్తింపు తీసుకువచ్చారు.
కార్డియాలజిస్ట్ను అవుతా..
మాది కరీంనగర్ జిల్లా శ్రీరాములుపేట గ్రామం. మా తల్లిదండ్రులు వ్యవసాయకూలీలు. పదోతరగతి వరకు నందిమేడారం పాఠశాలలో చదువుకొని ఇంటర్లో హత్నూర కళాశాలలో చేరా. ఇక్కడ ఉపాధ్యాయులు విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా విద్యను బోధిస్తుండడంతో భవిషత్లో డాక్టర్ కావాలని నిరంతరం సాధన చేసి జేఈఈలో మంచి మార్కులు సాధించా. భవిష్యత్లో కార్డియాలజిస్ట్ను అయి గ్రామీణ ప్రాంత పేదలకు సేవచేయాలన్నదే నా సంకల్పం.
ప్రోత్సాహం బాగుంది..
కళాశాలలో ఉపాధ్యాయుల ప్రోత్సాహం బాగుంది. నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించి చదువులో రాణించేలా కృషి చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రోత్సహించడంతో నేను జేఈఈలో సీటు సాధించా. పేద విద్యార్థులకు అన్ని వసతులు కల్పించి విద్య అందిస్తున్న ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. భవిష్యత్లో వైద్యవిద్య అభ్యసించి ఉన్నతస్థాయికి ఎదగాలన్నదే లక్ష్యం.
విద్యార్థుల బంగారు భవిష్యత్కు బాటలు..
పేద విద్యార్థుల బంగారు భవిష్యత్కు బాటలు వేసేందుకు గురుకులాల్లో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాం. వారు ఉన్నతస్థాయికి చేరడానికి నిరంతరం కృషిచేస్తున్నాం. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాల్లో మా విద్యార్థులకు సీటురావడం చాలా సంతోషంగా ఉంది. కంప్యూటర్ ల్యాబ్ టాపర్స్ ఆన్లైన్ ప్రోగ్రాం ఉపయోగించుకుంటూ విద్యలో రాణించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాం.
నీట్లో అర్హత సాధించా..
నీట్లో అర్హత సాధించి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ హర్యానాలో సీటు సాధించా. తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను నెరవేర్చి భవిష్యత్లో ఉన్నతస్థాయికి చేరడానికి కృషిచేస్తా. కళాశాల అధ్యాపక బృందం విద్యార్థులను అన్నివిధాలుగా ప్రోత్సహిస్తుండడంతోనే నేడు ఎంతోమంది విద్యార్థులు విజయాలు సాధిస్తున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ వివేకానంద సార్కు ప్రత్యేక ధన్యవాదాలు.