మెదక్ మున్సిపాలిటీ, అక్టోబర్ 21 : కరోనా కారణంగా గత విద్యా సంవత్సరం ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేసింది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రథమ సంవత్సరం మార్కుల ఆధారంగా మార్కులు కేటాయించారు. ప్రథమ సంవత్సరం వారిని సైతం పరీక్షలు లేకుండానే ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్ చేశారు. ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గడంతో ప్రత్యక్ష బోధన ప్రారంభమైంది. పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, అందుకు అనుగుణంగా ఇంటర్ బోర్డు ఏర్పా ట్లు చేసింది. ఈ నెల 25 నుంచి నవంబర్ 2 వరకు పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ ప్రకటించింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో అధ్యాపకులు ప్రత్యేక తరగతుల నిర్వహణ ప్రారంభించారు.
పరీక్ష రాయనున్న 7211 మంది విద్యార్థులు..
మెదక్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్తో కలిపి 62 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో 42 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. 7211 మంది విద్యార్థులు ప్రథమ సంవత్సరం పరీక్షలు రాయనున్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు తగిన ఏర్పాట్లు చేయనున్నారు. ప్రథమ సంవత్సర పరీక్షల నిర్వహణకు 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో, 13 ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి.
వెసులుబాటుతో ప్రశ్నాపత్రాలు..
కరోనా కారణంగా ప్రథమ సంవత్సర పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఆన్లైన్లో ఎక్కువ శాతం బోధన జరిగింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు సులభంగా పాస్ అయ్యే లా విద్యాశాఖ అధికారులు 70 శాతం సిలబస్ను మాత్ర మే పరిగణలోకి తీసుకొని ప్రశ్నాపత్రాలను ఎక్కువ వెసులుబాటుతో రూపొందించారు. షార్ట్ నోట్స్ మాదిరి ప్రశ్నపత్రాలు, బేసిక్ లెర్నింగ్ మెటీరియల్ను tsbic. ccg. gov.in వెబ్సైట్లో విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. సగటు విద్యార్థి ఈ లెర్నింగ్ మెటీరియల్ను చదివితే తప్పకుండా పాస్ అవుతారని విద్యాశాఖ ఆధికారులు సూచిస్తున్నారు.
ఫీజు చెల్లించిన చోటే..
కరోనా కారణంగా ప్రథమ సంవత్సరం ఒక కళాశాలలో ద్వితీయ సంవత్సర మరోచోట చదువుతున్న విద్యార్థులు, వారు ఎక్కడ పరీక్ష ఫీజు చెల్లించారో ఆ కళాశాలలోనే పరీక్ష రాయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
ప్రభుత్వ నిబంధనల మేరకు ఏర్పాట్లు
కోవిడ్ నిబంధనల దృష్ట్యా ప్రభుత్వ నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహిస్తాం. ప్రతి విద్యార్థి భౌతిక దూరం పాటించేలా చర్య లు తీసుకుంటున్నాం. పరీక్షలను సమర్థవంతంగా నిర్వహిస్తాం. జిల్లాలో 34 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశాం. కరో నా నేపథ్యంలో బెంచీకి ఒకరు చొప్పున ఒక గది 20మందిలోపే పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేశాం.