చేర్యాల, నవంబర్ 11: కొమురవెల్లి మల్లికార్జునస్వామి వారి క్షేత్రంలో ఎల్లమ్మ, నల్లపోచమ్మ అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు శ్రీశైల పీఠాధిపతి డా.శ్రీ. చెన్న సిద్ధరామయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గురువారం నిర్వహించిన ముగింపు పూజా కార్యక్రమాలకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, ట్రైనీ కలెక్టర్ ప్రపుల్దేశాయి తదితరులు హాజరయ్యారు. అమ్మవారి ఆలయంలో పీఠాధిపతి ఆధ్వర్యంలో ఈవో అలూరి బాలాజీ, ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. ఆలయ అర్చకుడు మహదేవుని చిన్న మల్లికార్జున్ దంపతులు ప్రతిష్ట సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
వైభవంగా ప్రతిష్ట మహోత్సవం..
శ్రీశైల పుణ్యక్షేత్ర పీఠాధిపతి డా.శ్రీ చెన్న సిద్ధరామయ్య మహాస్వామి గురువారం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న అనంతరం గుట్టపై భాగంలో నిర్మించి ఎల్లమ్మ ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతిష్టోత్సవాన్ని వైభవంగా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జయాది హోమం, మహా పుర్ణాహుతి, కలశ ద్యాసం, శిఖర కుంభాభిషేకం, కలశప్రోక్షణ, శాంతి కల్యాణం, మహా మంగళ హారతి, మహా మంత్రపుష్పం, మహదాశిర్వచనం, తీర్థ ప్రసాద వితరణ తదితర పూజలు నిర్వహించారు. ఎల్లమ్మ ఆలయంలో పక్కనే నిర్మించిన నల్లపోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి విగ్రహాన్ని ప్రతిష్టించారు. కార్యక్రమాల్లో ఆలయ ఏఈవో వైరాగ్యం అంజయ్య, ధర్మకర్తలు ఉట్కూరి అమర్గౌడ్, ముత్యం నర్సింహులు, చింతల పర్శరాములు, బొంగు నాగిరెడ్డి, తూముల రమేశ్యాదవ్, పోతుగంటి కొమురవెల్లి, తాళ్లపల్లి శ్రీనివాస్, దినేష్ తివారి, కొంగరి గిరిధర్, గడ్డం మహేశ్యాదవ్, ధరావత్ అనిత, సూపరింటెండెంట్ నీల శేఖర్, ఆలయ సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు పాల్గొన్నారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఆలయవర్గాలు నిర్వహించారు.
దైవ భూమిగా మారుతున్న తెలంగాణ..
సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో తెలంగాణ రాష్ట్రం దైవభూమిగా మారుతున్నదని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఎల్లమ్మ ప్రతిష్ట మహోత్సవానికి హాజరైన సందర్భంగా ఎమ్మెల్యే జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ రైతులకు సాగు నీరు అందించేందుకు నిర్మించిన ప్రాజెక్టులకు దేవుళ్ల పేర్లు నామకరణం చేసిన ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనన్నారు. మల్లన్న ఆలయం టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి పథంలో పయణిస్తున్నదని, రానున్న రోజుల్లో దివ్య క్షేత్రంగా కొమురవెల్లి అభివృద్ధి చెందుతుందన్నారు. వారి వెంట ఎంపీపీలు తలారీ కీర్తనాకిషన్, వుల్లంపల్లి కరుణాకర్, జడ్పీటీసీలు సిలువేరు సిద్ధప్ప, శెట్టె మల్లేశం, మార్కెట్ కమిటీ చైర్మన్ సుంకరి మల్లేశం, వైస్ చైర్మన్ పుర్మ వెంకట్రెడ్డి, సర్పంచ్లు సార్ల లతాకిష్టయ్య, పచ్చిమడ్ల స్వామిగౌడ్ తదితరులున్నారు.