అమరావతి : కడప రిమ్స్ వైద్య కళాశాలలో రేపటి నుంచి నిర్వహించనున్న ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తామని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరీక్షలను వాయిదా వేయలేమని, కరోనా సోకిన వారికి ప్రత్యేక గదుల్లో పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది . కడప రిమ్స్ వైద్య కళాశాలలో ఈరోజు 50 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. మొత్తం 150 మంది కొవిడ్ పరీక్షలు చేయించుకోగా వీరిలో 50 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయ్యింది. మరికొందరు నివేదికలు రావాల్సి ఉంది.
ఈ పరిస్థితిలో పరీక్షను వాయిదా వేయాలని విద్యార్థులు కళాశాల యాజమాన్యాన్ని కోరారు. కళాశాల యాజమాన్యంఈ విషయాన్ని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ దృష్టికి తీసుకెళ్లింది. స్పందించిన వర్సిటీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నాలుగు సంవత్సరాల పాటు కష్టపడుతున్న వైద్య విద్యార్థులకు కరోనా ప్రభావం చూపి పరీక్షలను వాయిదా వేయలేమని, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.