హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. శాంతి దూత మహారాజ అగ్రసేన్ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లో తెలంగాణ అగర్వాల్ సమాజ్ ఆధ్వర్యంలో ‘ట్రేసర్ హంట్’ పేరిట వినూత్న కారు ర్యాలీ నిర్వహించగా.. మేయర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. దాదాపు 123 కార్లు ర్యాలీలో పాల్గొన్నాయి. ర్యాలీలో పరిశుభ్రత, పచ్చదనంతో కూడిన ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఆకాంక్షిస్తూ కార్ల యజమానులు డ్యాష్ బోర్డులు, టాప్పై సృజనాత్మకంగా కళారూపాలను ప్రదర్శించగా.. పలువురిని ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ వాతావరణ సంక్షోభంతో కరువులు, అడవుల్లో అగ్ని ప్రమాదాలు, వరదలు సంభవించడంతో పాటు భూతాపం పెరుగుతోందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి, వాతావరణ మార్పు కోసం జరుగుతున్న పోరాటంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. పర్యావరణ రక్షణ కోసం మహత్తర యత్నంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ హరితహారం నిధిని ప్రకటించారని, ప్రజలు, అగర్వాల్ సమాజ్లాంటి సంస్థలు కూడా ఇందులో భాగస్వామ్యులు కావాలన్నారు.
తెలంగాణ అగర్వాల్ సమాజ్ అధ్యక్షుడు అంజనీ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ తెలంగాణ హరితనిధి ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగస్వాములై ప్రతి ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతామన్నారు. హరితహారానికి రూ.లక్ష విరాళం త్వరలో ప్రభుత్వానికి అందజేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో అంకిత్ గుప్తా, ఆశిష్ దోచనీయ, నవీన్ అగర్వాల్, సూర్య కమల్ గుప్తా, సందేశ్ అగర్వాల్, రాహుల్ సింఘాల్, రితీష్ జిగ్నాని, రింకు అగర్వాల్ పాల్గొన్నారు.