మియాపూర్ , డిసెంబర్ 7 : పరిసరాల పరిశుభ్రత, పటిష్టమైన పారిశుధ్యంతో నగర ఖ్యాతి మరింతగా పెరుగుతోందని, క్షేత్రస్థాయిలో సిబ్బంది ఇంకా కష్టపడి పని చేయాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. దీనికి తోడు సమగ్రమైన అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని, అమలు విషయంలో అధికారుల పాత్ర కీలకమన్నారు. శేరిలింగంపల్లి జోన్లో లింక్ రహదారుల అభివృద్ధి అద్భుతంగా ఉన్నదని మేయర్ కితాబునిచ్చారు. జోనల్ స్థాయి సమీక్షా సమావేశాల్లో భాగంగా తొలి సమావేశాన్ని ఖైరతాబాద్లో నిర్వహించారు. రెండో సమీక్షా సమావేశాన్ని శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో మేయర్ విజయలక్ష్మి, జోనల్ కమిషనర్ అల ప్రియాంకతో కలిసి జోన్ పరిధిలోని పారిశుధ్య, ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళికా విభాగం, అర్బన్ బయో డైవర్సిటీ, విద్యుత్, వెటర్నరీ, ఎంటమాలజీ విభాగాలతో మంగళవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ఐటీ పరిధిలో ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు లింక్ రోడ్లు, పాదచారుల కోసం ఫుట్ ఓవర్ వంతెనలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. జోన్ పరిధిలో 541పబ్లిక్ టాయిలెట్లను ఈనెల చివరి కల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్రజా అవసరాల కోసం చేపట్టే రహదారుల నిర్మాణంలో ఏమాత్రం జాప్యానికి ఆస్కారం లేకుం డా చూడాలని మేయర్సూచించారు. ప్రజల నుంచి ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని మేయర్ పేర్కొన్నారు. వంద శాతం టీకా లక్ష్యాన్ని చేరుకోవాలని, ప్రతి శుక్రవారాన్ని గ్రీన్ డేగా పాటించాలని సూచించారు. కార్యక్రమంలో డీసీలు, వైద్యాధికారులు, ఎంటమాలజీ, యూబీ డీ, ఇంజినీరింగ్ విభాగాల అధికారులు పాల్గొన్నారు. తొలిసారిగా జోనల్ కార్యాలయానికి విచ్చేసిన మేయర్కు జోనల్ కమిషనర్ అల ప్రియాంక మొక్కను బహూకరించి, స్వాగతం పలికారు.