ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర.. స్టాక్ మార్కెట్ల ఉసురు తీసింది.
మదుపరులు తీవ్ర అమ్మకాల ఒత్తిడిలోకి జారుకోవడంతో ఒక్కసారిగా సూచీలు కుప్పకూలాయి.
ఉదయం ఆరంభం నుంచే భీకర నష్టాలు మొదలవగా.. ఈ ఒక్కరోజే లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది.
ముంబై, ఫిబ్రవరి 24: స్టాక్ మార్కెట్లు ఉలిక్కిపడ్డాయి. ఉక్రెయిన్పై దాడి చేసేందుకు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న రష్యా.. గురువారం అనుకున్నంత పనీ చేసింది. దీంతో భారత్సహా ప్రపంచ సూచీలు భీకర నష్టాలను చవిచూశాయి. మదుపరుల భయాల మధ్య ఉదయం ఆరంభం నుంచే అమ్మకాల ఒత్తిడిలోకి మార్కెట్లు జారుకున్నాయి. ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న దండయాత్ర.. సమయం గడుస్తున్నకొద్దీ నష్టాలను పెంచుతూపోయింది. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 2,702.15 పాయింట్లు లేదా 4.72 శాతం క్షీణించి 54,529.91 వద్ద ముగిసింది. 2020 మార్చి 23 నుంచి గమనిస్తే ఒక్కరోజే ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. అంతేగాక సెన్సెక్స్ చరిత్రలోనే ఇది నాల్గో అతిపెద్ద నష్టం కావడం గమనార్హం. నిజానికి ఒకానొక దశలో దాదాపు 2,850 పాయింట్లు సూచీ కోల్పోయింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 815.30 పాయింట్లు లేదా 4.78 శాతం దిగజారి 16,247.95 వద్ద నిలిచింది. ఫలితంగా వరుసగా ఏడోరోజూ మార్కెట్లు నష్టాలకే పరిమితమైనైట్టెంది. ఉక్రెయిన్పై రష్యా దాడి.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ను అతిపెద్ద సంక్షోభంలోకి నెట్టిందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది.
భారీ నష్టాల మధ్య బీఎస్ఈ 500 ఇండెక్స్లో 97 స్టాక్స్ 52 వారాల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. వీటిలో బీపీసీఎల్, డాక్టర్ రెడ్డీస్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, అపోలో టైర్స్, ఎంఆర్ఎఫ్, హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్, వోక్హార్డ్ లిమిటెడ్ తదితర షేర్లున్నాయి. ఇక ఈ ట్రేడింగ్లో దాదాపు 279 షేర్లు తమ ఏడాది కనిష్ఠ స్థాయిని తాకినట్టూ బీఎస్ఈ వర్గాలు చెప్తున్నాయి.
స్టాక్ మార్కెట్ల నష్టాలు.. ఈ ఒక్కరోజే లక్షల కోట్ల రూపాయల మదుపరుల సంపదను ఆవిరి చేశాయి. సెన్సెక్స్లోని అన్ని షేర్లూ పతనమవగా, బీఎస్ఈలో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ రూ.13,44,488.54 కోట్లు హరించుకుపోయింది. దీంతో రూ.2,42,24,179.79 కోట్లకు పరిమితమైంది. సెన్సెక్స్ షేర్లలో ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ విలువ గరిష్ఠంగా 7.88 శాతం క్షీణించింది. ఇక బీఎస్ఈ మిడ్క్యాప్ 5.53 శాతం, స్మాల్క్యాప్ 5.77 శాతం పడిపోయాయి. రంగాలవారీగా మొత్తం 19 బీఎస్ఈ సూచీలూ నష్టాల్లోనే ముగిశాయి. రియల్టీ, టెలికం, ఆటో, బ్యాంకింగ్ షేర్లు 7.27 శాతం వరకు కోల్పోయాయి. మరోవైపు దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత మదుపరుల పెట్టుబడి ఉపసంహరణలు కొనసాగుతున్నాయి. గురువారం రూ.6,448.24 కోట్ల విలువైన షేర్లను అమ్మేసినట్టు స్టాక్ ఎక్సేంజ్ వర్గాలు వెల్లడించాయి.
ఇండస్ఇండ్ 7.88%
ఎంఅండ్ఎం 6.34%
బజాజ్ ఫైనాన్స్ 6.02%
యాక్సిస్ బ్యాంక్ 5.99%
టెక్ మహీంద్రా 5.75%
మారుతి 5.65%
టాటా స్టీల్ 5.61%
బజాజ్ ఫిన్సర్వ్ 5.57%
హెచ్డీఎఫ్సీ బ్యాంక్5.48%
విప్రో 5.38%
2020 మార్చి 23 3,934.72
2020 మార్చి 12 2,919.26
2020 మార్చి 16 2,713.41
2022 ఫిబ్రవరి 24 2,702.15
2020 మే 4 2,002.27
2020 మార్చి 9 1,941.67
2021 ఫిబ్రవరి 26 1939.32
2022 ఫిబ్రవరి 14 1,747.08
2020 మార్చి 18 1,709.58
2021 నవంబర్ 26 1,687.94