లక్నో, ఫిబ్రవరి 14: బీఎస్పీ అధినేత్రి మాయావతిపై యూపీ సీఎం యోగి ద్వంద్వార్థం వచ్చేలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ వార్తా ఏజెన్సీ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగి మాట్లాడుతూ.. నా చెల్లెలు మాయావతి-ఏనుగు పొట్ట అతిపెద్దది. ఎంత తిన్నా దానికి చాలదు అంటూ ద్వంద్వార్థం వచ్చేలా బీఎస్పీ ఎన్నికల గుర్తును (ఏనుగు) మాయావతి శరీరానికి అన్వయిస్తూ వ్యాఖ్యానించారు. యోగి వ్యాఖ్యలపై బీఎస్పీ జాతీయ ప్రతినిధి సధీంద్ర భదోరియా మండిపడ్డారు. దళితులు, వెనుకబడిన వర్గాలపట్ల యోగి దృక్పథానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమని ధ్వజమెత్తారు. అంబేద్కర్ ఏనుగు గుర్తును ఇచ్చారని, దళితుల అభ్యున్నతికి కాన్షీరామ్ కృషి చేశారని, వారి ఆశయాలను నెరవేర్చేందుకు మాయావతి కృషి చేస్తున్నారని తెలిపారు.