లఖీంపూర్ ఖేరీ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి పదవికి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయం ఉభయ సభల్లోనూ తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. రాజ్యసభలో అధికార పక్ష నేత, కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ స్పందించారు. ప్రతిపక్షాలు ఈ అంశంలో చేస్తున్న వ్యాఖ్యలు నిరాధారమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని, సుప్రీం ఆదేశాల మేరకు విచారణ సాగుతోందని పీయూశ్ పేర్కొన్నారు. అయితే ఈ అంశంపై చర్చించాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో, కోర్టు పరిధిలో ఉన్న అంశాలను చర్చించరాదని పార్లమెంట్ రూల్స్ చెబుతున్నాయని గోయల్ పేర్కొన్నారు.
అలాగే ప్రతిపక్షాలు సభలో వ్యవహరిస్తున్న తీరును కూడా పీయూశ్ తప్పుబట్టారు. తమను విమర్శించడానికి ప్రతిపక్షాల వద్ద ఎలాంటి అంశమూ లేదని, అందుకే ఇలా వ్యవహరిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. సభలో వారు అమర్యాదగా ప్రవర్తించారని, క్షమాపణలు చెప్పాలని పీయూశ్ గోయల్ డిమాండ్ చేశారు.