మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 24 : గణితంలో సరికొత్త బోధనకు శ్రీకారం చుట్టేందుకు రాష్ట్రీయ విద్యా పరిశోధన సంస్థ (ఎస్సీ ఈఆర్టీ) కృషి చేస్తున్నది. భవిష్యత్తో విద్యార్థులకు సరికొత్త వ్యూహాలతో బోధన చేపట్టాల్సిన అంశాలపై రాష్ట్రస్థాయిలో గణిత సదస్సు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యావేత్తల నుంచి పరిశోధన పత్రాలను ఆహ్వానిస్తున్నారు.
అభివృద్ధే ధ్యేయంగా..
శ్రీనివాస రామానుజన్ జయంతి, గణిత దినోత్సవం సందర్భంగా గణితంలోని పలు అంశాలపై రాష్ట్రీయ విద్యా పరిశోధన సంస్థ రాష్ట్రస్థాయిలో సదస్సు నిర్వహిస్తున్నది. గణితం బోధిస్తున్న ఉపాధ్యాయులు, విద్యావేత్తలు గణితంలో వృత్తిపర అభివృద్ధి సాధించాలనే లక్ష్యం, ఆధునిక విషయాలను తెలుసుకొని బోధనను వినూత్న రీతిలో చేపట్టేలా దీనికి రూపకల్పన చేశారు. సదస్సు డిసెంబర్ 22న నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనేందుకు పాఠశాలల ఉపాధ్యాయలు, ప్రైవేట్ ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, ఎడ్యుకేటర్లు, గణిత విద్యకు సంబంధించిన వారు అర్హులు. జిల్లాలో ఆసక్తి గల వారు డిసెంబర్ 2వ తేదీలోపు గణితం అభ్యాసనంపై కొత్త వ్యూహాలకు సంబంధించిన పరిశోధన పత్రాలను tgs-ce-etmathss-cir-n-ce-<\@> gmail-com పంపించాలి.
అంశాలు ఇవే..
2020-21 గణితం బోధించడంలో అనుసరించిన పద్ధతులు, వ్యూహాలు ప్రధానాంశంగా పరిశోధన పత్రాల కోసం తీసుకున్నారు. బోధన అభ్యాసనాన్ని టెక్నాలజీతో పొందుపర్చడం, కొవిడ్-19తో గణితంలో అభ్యాసన అంతరాలను పరిష్కరించడం, మహమ్మారి కాలంలో ఉపయోగించిన కొత్త వ్యూహాలను భవిష్యత్లో ఉపయోగించి బోధన చేయాలనే వాటిని ఉప అంశాలుగా ఎంపిక చేశారు. పరిశోధన పత్రాలను ఆన్లైన్లో స్వీకరించి, ఎంపికైన వారిని రాష్ట్రస్థాయి సదస్సులో పాల్గొనే అవకాశం కల్పించనున్నారు. గతేడాది జిల్లా నుంచి ఒకరికే అవకాశం దక్కిం ది. ఈ అంశాలపై అర్హులైన వారు దరఖాస్తు చోసుకోవచ్చని రాష్ట్రీయ విద్యా పరిశోధన సంస్థ సూచిస్తున్నది. దరఖాస్తులను తెలుగు, ఇంగ్లిష్లో పంపవచ్చు.
వినియోగించుకోవాలి..
జిల్లాలోని గణిత ఉపాధ్యాయులు, గణిత మేధావులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ప్రతి సంవత్సరం జిల్లా నుంచి ఒకరు లేదా ఇద్దరికి సదస్సులో పాల్గొనే అవకాశం దక్కుతున్నది. ఈసారి ఎక్కువ మందికి అవకాశం దక్కాలి. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చిన వారు జాతీయ స్థాయిలో పాల్గొనే అవకాశం ఉంటుంది.