షిమ్లా : హిమాచల్ప్రదేశ్ షిమ్మా జిల్లాల్లో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఐదో నంబర్ జాతీయ రహదారిపై బండరాళ్లు పేరుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సిమ్లాలోని రాంపూర్ సమీపంలోని జియోరి వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే, ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగలేదని రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ సెంటర్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం జాతీయ రహదారిని మూసివేసినట్లు డీసీపీఆర్ పేర్కొంది. అయితే, కొండచరియల విరిగిపడ్డ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
కొండచరియలు విరిగిపడ్డ ప్రదేశానికి సమీపంలో ఉన్న కొందరు ఘటనను కెమెరాలో బంధించారు. ఒక్కసారిగా పెద్దపెద్ద బండరాళ్లు రోడ్డుపై పడడంతో అక్కడున్న వారంతా కేకలు పెడుతూ పరుగులు పెట్టారు. ఇదిలా ఉండగా.. పరిస్థితిని అంచనా వేయడానికి జిల్లా యంత్రాంగం సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్, ప్రత్యేక పోలీస్ బృందాన్ని నియమించింది. వర్షాకాలంలో రాష్ట్రంలో భారీ వర్షపాతం నమోదవుతోంది. దీంతో కొండచరియలు విరిగిపడ్డాయి. ఇంతకు ముందు ఆగస్ట్ 28న, చండీగఢ్-మనాలి జాతీయ రహదారి మండి జిల్లాలోని కొండచరియలు విరిగిపడగా.. రహదారిని మూసివేశారు.