న్యూఢిల్లీ, జనవరి 26: మారుతి వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో మారుతి సుజుకి పెండింగ్ ఆర్డర్లు జనవరిలో 4.05 లక్షల యూనిట్లకు చేరాయి. ఇటీవల జరిగిన ఆటో ఎక్స్పోలో ఆవిష్కరించిన ఎస్యూవీలు జిమ్నీ, ఫ్రోంక్స్కు సైతం బుకింగ్స్ అధికంగా కావడంతో పెండింగ్ ఆర్డర్లలో ఇవి కూడా చేరాయని మారుతి సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ చెప్పారు. జిమ్నీ బుకింగ్స్ 11 వేలు దాటగా, ఫ్రొంక్స్కు 4 వేల యూనిట్లు ఉన్నాయని తెలిపారు. ఈ రెండు కొత్త మోడల్స్ ధరల్ని కంపెనీ ప్రకటించలేదు. 2022 డిసెంబర్ చివరినాటికి 3.63 లక్షల మారుతి వాహనాలకు పెండింగ్ కస్టమర్ ఆర్డర్లు ఉండగా, అందులో 1.19 లక్షల ఆర్డర్లు కొత్తగా విడుదల చేసిన మోడల్స్వే. 2022 జనవరితో పోలిస్తే ఈ జనవరిలో తమ వాహనాలకు బుకింగ్స్ 16 శాతం వృద్ధిచెందాయని శ్రీవాస్తవ వెల్లడించారు. 2022లో కంపెనీ వాహన విక్రయాలు అంతక్రితం ఏడాదితో పోలిస్తే 16 శాతం వృద్ధిచెంది 13.64 లక్షల యూనిట్ల నుంచి 15.74 లక్షల యూనిట్లకు పెరిగాయి.