న్యూఢిల్లీ, జనవరి 25: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ లాభాలకు చిప్ల కొరత గండికొట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.1,041.80 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,996.7 కోట్ల లాభంతో పోలిస్తే 47.82 శాతం తక్కువ. సెమికండక్టర్ల కొరతతో ఉత్పత్తి నిలిచిపోవడం, మరోవైపు కమోడిటీ ఉత్పత్తుల ధరలు పెరగడం కూడా లాభాలపై ప్రతికూల ప్రభావం చూపాయని పేర్కొంది. పండుగ సీజన్లోనూ అమ్మకాలు అంతంతే నమోదుకావడం, కమోడిటీ ఉత్పత్తుల ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోవడం, నాన్-ఆపరేటింగ్ ఆదాయం తక్కువగా ఉండటం ఆర్థిక ఫలితాలపై ప్రభావం చూపాయని పేర్కొంది.
ఆదాయం కూడా అంతంతే
లాభాల్లో ఎదురుదెబ్బ తగిలిన సంస్థకు అటు ఆదాయంలోనూ నిరాశ తప్పలేదు. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.23,253.30 కోట్ల ఆదాయం మాత్రమే ఆర్జించింది. 2020-21 ఇదే త్రైమాసికంలో రూ.23,471.30 కోట్లుగా ఉన్నది. మరోవైపు, గత మూడు నెలల్లో సంస్థ 4,30,668 యూనిట్ల వాహనాలను విక్రయించింది. గతేడాది విక్రయించిన 4,95,897 యూనిట్లతో పోలిస్తే ఇది 13 శాతం తక్కువ. అంతర్జాతీయంగా ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత కారణంగా గత త్రైమాసికంలో 90 వేల యూనిట్ల కార్లను ఉత్పత్తి చేయలేకపోయినట్లు, మరోవైపు పండుగ సీజన్లో డిమాండ్ అధికంగా ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో ప్లాంట్లలో ఉత్పత్తి చేయలేదని పేర్కొంది. ప్రస్తుతం 2.40 లక్షల ఆర్డర్లు పెండింగ్లో ఉన్నాయి. ప్రస్తుత త్రైమాసికంలో పూర్తిస్థాయి ఉత్పత్తిని సాధిస్తామన్న ధీమాను వ్యక్తం చేసింది.