సిటీబ్యూరో, డిసెంబర్ 28(నమస్తే తెలంగాణ): ‘పొట్లం’ అంటే..ఏదో అనుకోకండి.. అది గంజాయికి కోడ్ భాష.. అక్రమ వ్యాపారులు, మత్తు బానిసలు ఎవరికీ అనుమానం రాకుండా ఇలా పిలుచుకుంటున్నారు. పోలీసుల తనిఖీలు, పకడ్బందీ సోదాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న అక్రమ వ్యాపారులు.. తమదైన శైలిలో మత్తు పదార్థాలను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. దందాపై ముప్పేట దాడి చేస్తుండటంతో మత్తుబాబులు సైతం అవస్థలు పడుతున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న కొందరు పొట్లం పేరుతో ‘మత్తు’ను రూ. 5వేలకు విక్రయిస్తున్నట్లు సమాచారం.
సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రత్యేకంగా నార్కోటిక్ సెల్ను ఏర్పాటు చేసి..ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని నియమించారు. ఆయన పర్యవేక్షణలో ప్రతి రోజూ గంజాయి, డ్రగ్స్ దందాలపై సమాచారం సేకరిస్తూనే ఉన్నారు. సరఫరా చేసే వారితో పాటు వాటిని సేవిస్తున్న వారిని కూడా పోలీసులు అరెస్టు చేస్తున్నారు. 24వ తేదీ నుంచి 27 వరకు జరిపిన డ్రైవ్లో ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 17.50 కేజీల గంజాయి, మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా 203 మందిపై ఈ- పెట్టీ కేసులను నమోదు చేశారు.
గంజాయి, డ్రగ్స్ పై పోలీసుల నిఘా పెరగడంతో మత్తు అలవాటుకు బానిసలైన వారు ‘పొట్లం’ కావాలంటూ.. తిరుగుతుండడం కనిపిస్తున్నది. కొన్ని చోట్ల ఈ పొట్లం ధర రూ. 5వేలు పలుకుతున్నదని సమాచారం. మా దగ్గర పొట్లం ఉందని.. అయితే ఖరీదు అంటూ.. కొందరు అక్రమ వ్యాపారులు చక్కర్లు కొడుతున్నారని తెలిసింది. అందులో 5 గ్రాముల మత్తు పదార్థాలు ఉంటాయని ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తానికి మత్తు దందా కోసం ‘పొట్లం’ పేరును మార్కెట్లో ప్రచారం చేస్తున్నారు.
మరికొందరు కూలీలకు డబ్బులు ఆశచూపి వారితో రహస్యంగా గంజాయి మొక్కలను పెంచాలని ప్రేరేపిస్తున్నారు. ‘మీకు ఏమైనా అయితే మేము చూసుకుంటా’మని పురిగొలుపుతున్నారు. ఇలా డబ్బుకు ఆశపడ్డ కూలీలు.. వీటిని పెంచేందుకు ఆసక్తి చూపుతున్నారు. పోలీసులకు దొరికినప్పుడు కూలీలు పట్టుబడుతుండగా, వీరి వెనకాల ఉన్న వారు మాత్రం తప్పించుకుంటున్నారని తెలుస్తున్నది.