హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్ల నిమిత్తం బ్యాంకుల నుంచి తెచ్చిన రుణాలకు కేంద్రం రెండు నెలల వడ్డీ మాత్రమే చెల్లిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం పది నెలల వడ్డీ భరిస్తున్నదని తెలంగాణ పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత ధోరణి కారణంగా రాష్ర్టాలే ఆర్థిక భారం మోయాల్సి వస్తున్నదని, దీంతో ఒడిశా పౌరసరఫరాల సంస్థ ఇకపై ధాన్యాన్ని కొనుగోలు చేయలేమని ప్రభుత్వానికి లేఖ రాసిందని చెప్పారు.
ధాన్యం నిల్వకు అవసరమైన స్టో రేజీ ఖర్చులను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తున్నదని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. హమాలీ చార్జీల కింద కేంద్రం తెలంగాణకు క్వింటాలుకు రూ.5.65 చెల్లిస్తుండగా.. పంజాబ్, హర్యానా రాష్ర్టాల్లో రూ.24.25 చెల్లిస్తున్నదని వివరించారు. గోనె సంచుల సరఫరాలోనూ కేంద్రం తీరు సరిగా లేదన్నారు. అన్ని అంశాల్లోనూ కక్షపూరితంగా వ్యవహరిస్తుండగా, రాష్ట్రం లో ఆ పార్టీ నేతలు ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి అవాస్తవాలు చెప్తూ, రాష్ట్రంపై నిందలు మోపుతున్నారని, బాయిల్డ్ రైస్ విషయంలో అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. 20 ఏండ్ల క్రితంనాటి నిబంధనల ప్రకారమే బాయిల్డ్ రైస్ ఇస్తున్నట్టు స్పష్టంచేశారు. ఎఫ్సీఐ 25% నూకను ఆమోదిస్తుందని, కానీ తెలంగాణలో యాసంగి ధాన్యాన్ని మిల్లింగ్ చేయడం వల్ల 30 నుంచి 40 శాతం నూక వస్తుందని చెప్పారు. అందుకే ఆ ధాన్యాన్ని బాయిల్డ్ రైస్గా మారుస్తారని వివరించారు. ఎఫ్సీఐకి క్వింటా ధాన్యానికి రా రైస్ అయితే 67 కేజీలు, బాయిల్డ్ రైస్ అయితే 68 కేజీలు ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు.