హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సేకరించిన బియ్యాన్ని(సీఎమ్మార్) తరలించే విషయంలో భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) జాప్యం చేస్తున్నదని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. ఎఫ్సీఐ గోదాముల ముందు 11 జిల్లాల్లో దాదాపు 720 లారీలు అన్లోడింగ్ కోసం వారం రోజులుగా పడిగాపులుకాస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం ఆయన పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బియ్యం సరఫరాకు అవసరమైన వ్యాగన్లను ఎఫ్సీఐ సమకూర్చడం లేదని విమర్శించారు.
గత వానకాలంలో ఇదే సమయానికి 1,476 ర్యాక్ల ద్వారా 39.04 లక్షల టన్నుల బియ్యా న్ని ఇతర రాష్ర్టాలకు తరలించగా, ఈ ఏడాది 1,096 ర్యాక్ల ద్వారా 29.28 లక్షల టన్నులే తరలించడం ఎఫ్సీఐ నిర్లక్ష్యానికి నిదర్శనమని చెప్పారు. గోదాముల్లో స్థలం చూపించకుండా రాష్ట్ర ప్రభు త్వం బియ్యం ఇవ్వడం లేదని నిందలు వేయడం సరికాదని పేర్కొన్నారు. స్టోరేజీ చూపిస్తే ఎంత బియ్యమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బియ్యం సేకరణలో, తనిఖీల్లో ఎఫ్సీఐ అనేక కొర్రీలు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నదని ఆరోపించారు. ఫిజికల్ వెరిఫికేషన్ పేరుతో నెలల తరబడి మిల్లింగ్ను నిలిపివేస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం, బియ్యం ఏ కొంచెం రంగు మారినా నిరాకరిస్తున్నారని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం తీరుతో ఏ రాష్ట్రం కూడా ధాన్యం కొనుగోలుకు ముందుకు రావడం లేదని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు బాధ్యత నుంచి తప్పుకొనేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ఇప్పటికైనా ఎఫ్సీఐ కొర్రీలను తగ్గించుకొని, స్టోరేజీ సమకూర్చాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్రంలో గగ్గోలు పెడుతున్న బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో టీఆర్ఎస్ నిర్వహిస్తున్న పోరాటాల్లో ఎందుకు కలిసిరావడం లేదని మారెడ్డి శ్రీనివాస్రెడ్డి నిలదీశారు. పార్లమెంటులో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల నిజస్వరూపం బయటపడిందని చెప్పారు. సోమవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 34 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు తెలిపారు. గత వానకాలంలో ఇదే తేదీతో పోల్చుకొంటే 7 లక్షల టన్నులు అధికంగా కొనుగోలు చేసినట్టు వివరించారు.