సిటీబ్యూరో, జనవరి 5(నమస్తే తెలంగాణ) : కేబీసీ రూ.25 లక్షల లాటరీ గెలుచుకున్నారంటూ డబీర్పురాకు చెందిన ఓ వ్యక్తికి సైబర్నేరగాళ్లు రూ.6.02 లక్షలు టోకరా వేశారు.
టాటా కన్సల్టెన్సీ పేరుతో..
హయత్నగర్, జనవరి 5 : టాటా కన్సల్టెన్సీ పేరుతో ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు హయత్నగర్ డివిజన్ పరిధిలోని పెద్దమ్మతల్లి కాలనీకి చెందిన చలమల్ల వెంకటేశ్కు ఫోన్ చేశారు. ఇన్సూరెన్స్ చేయిస్తామని, పర్సనల్ లోన్ ఇప్పిస్తామని దఫదఫాలుగా రూ.90,545 కట్టించుకున్నారు. తర్వాత ఫోన్ చేస్తే.. వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో మోసపోయానని గ్రహించి హయత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ సురేందర్ గౌడ్ తెలిపారు.
బంగారం దొరికింది..తక్కువ ధరకే ఇచ్చేస్తా.!
నకిలీ బంగారం అంటగట్టి..రూ.2.30లక్షలతో పరారైన కేటుగాడు
వనస్థలిపురం, జనవరి 5 : తనకు బంగారం దొరికింది. తక్కువ ధరకే అమ్మేస్తానంటూ దంపతులను నమ్మించిన ఓ వ్యక్తి రూ.2.30లక్షలు తీసుకుని నకిలీ బంగారం అంటగట్టి ఉడాయించాడు. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం జిల్లా తిమరం గ్రామానికి చెందిన అప్పల పాత్రుడు, నాగమణి దంపతులు వనస్థలిపురంలో నివాసముంటున్నారు. ఎల్బీనగర్లో మొక్కజొన్న కంకుల బండి నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి నెల రోజుల కిందట వీరబాబు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. బండి వద్దకు తరచుగా వస్తుండేవాడు.
సోమవారం వారి బండి వద్దకు వచ్చిన కేటుగాడు తనకు బంగారం దొరికిందని, కొంత మీకు ఇస్తానని, డబ్బులు ఇవ్వాలని కోరాడు. ఓ ముక్కను వారికి ఇచ్చాడు. దాన్ని బంగారం షాపులో పరిశీలించగా అసలు బంగారం అని తెలిసింది. దీంతో రూ.2.30లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. మంగళవారం వనస్థలిపురం గణేశ్ టెంపుల్ సమీపంలో నగదు ఇచ్చి, నగలు తీసుకున్నారు. వాటిని తీసుకుని షాపునకు వెళ్లగా అది నకిలీదని తెలిసింది. మొదట అసలు బంగారం ముక్క ఇచ్చి, నమ్మకం కుదిరిన తర్వాత నకిలీది అంటగట్టినట్లు గ్రహించారు. దీంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.