మంచిర్యాల పట్టణ ప్రజలకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను అందుబాటులోకి తెచ్చేందుకు మున్సిపల్ శాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు సకల సౌకర్యాలతో సమీకృత మార్కెట్ నిర్మిస్తుండగా, ఈ నెల 8న మంత్రి అల్లోల, ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యే దివాకర్రావు, కలెక్టర్ భారతీ హోళికేరి భూమి పూజ చేశారు.
మంచిర్యాలటౌన్, నవంబర్ 16 : పట్టణ ప్రజలకు సమీకృత మార్కె ట్లు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మున్సిపల్ శాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న మార్కెట్లు సరిపోకపోవడం, కొందరు రోడ్లపైనే విక్రయాలు సాగిస్తుండడం, పార్కింగ్ స్థలాలు లేక ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయి. వీటన్నంటికీ శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించింది. ప్రతీ మున్సిపాలిటీకి ఒకటి చొప్పున అధునాతన భవనాలను నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తిచేసింది. ఈ నెల 8న మంచిర్యాలలో నిర్మించే సమీకృత మార్కెట్ను మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఎంపీ వెంకటేశ్నేత, ఎమ్మెల్యే దివాకర్రావు, కలెక్టర్ భారతీ హోళికేరి చేతుల మీదుగా భూమిపూజ నిర్వహించారు. రైతులు, వ్యాపారులు, వినియోగదారులకు అన్ని రకాలుగా ఉపయోగపడేలా మార్కెట్ను నిర్మించనున్నారు. మార్కెట్లు ఉన్నా తక్కువ స్థలం ఉండడంతో రోడ్లపైనే వ్యాపారాలు సాగిస్తుండడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను నిర్మించాలని నిర్ణయించారు. వెంటనే స్థలాలను కేటాయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వెజ్, నాన్ వెజ్, పండ్లు, పూలు తదితర వ్యాపారాలన్నీ ఒకే చోట నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. మున్సిపాలిటీ కేంద్రాల్లో రెండెకరాలకు పైగా స్థలంలో మార్కెట్లు నిర్మించాలని ప్రతిపాదనలు రూపొందించారు.
త్వరలో భవన నిర్మాణాలు ప్రారంభం..
పట్టణంలోని ఐబీ ఆవరణ 85 సర్వే నంబర్లో రెండెకరాల ఆరు గుంటల స్థలాన్ని సమీకృత మార్కెట్కు కేటాయించారు. ఎంఏఅండ్ యూడీ శాఖ నుంచి రూ 4.50 లక్షలు, మున్సిపల్ ఫండ్ నుంచి రూ. 2.70 లక్షలు మొత్తం రూ. 7.20 కోట్లు వెచ్చించి అధునాతన మార్కెట్ను నిర్మించనున్నారు. ఇందులో వెజ్, నాన్వెజ్ మార్కెట్లు, పండ్లు, పూల మార్కెట్, కోల్డ్ స్టోరేజీ గది, విశాలమైన పార్కింగ్, బయోడైజెస్టర్, ఇంటర్నల్ పాత్వేస్, టాయిలెట్లను నిర్మించనున్నారు. కూరగాయల అమ్మకం కోసం 60 స్టాళ్లు, పండ్లు, పూల విక్రయాలకు 18, నాన్వెజ్ అమ్మకాల కోసం 26 స్టాళ్లు నిర్మించనున్నారు. భూమి నుంచి మూడు అడుగుల పైబడి ఎత్తులో ఉండేలా స్టాల్ను నిర్మిస్తారు. ప్రజలకు నాణ్యమైన కూరగాయలు, పండ్లు, మాంసాహార ఉత్పత్తులు అందించాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
త్వరగా అందుబాటులోకి తీసుకువస్తాం..
మంచిర్యాలలో సమీకృత మార్కెట్ పనులకు ఇటీవలే భూమిపూజ చేశాం. నిర్మాణం త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తాం. ఇప్పుడున్న కూరగాయల మార్కెట్ 50 ఏళ్ల కిందట నిర్మించింది. ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదు. తా త్కాలికంగా ఏర్పాటుచేసిన మార్కెట్లలోకి ప్రజలు అంతంత మాత్రంగానే వెళ్తున్నారు. అన్ని రకాల కూరగాయలు, పండ్లు, నాన్వెజ్ ఒకేచోట దొరుకుతుంటే అందరూ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. అందులోనూ పరిశుభ్రమైన వాతావరణంలో కూరగాయలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తారు.