కంఠేశ్వర్ ఆగస్టు 12 : దేశంలో ఎలక్షన్ కమిషన్ను అడ్డుపెట్టుకొని దొంగ ఓట్లతో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాడని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణుతో కలిసి జిల్లా కేంద్రంలో ప్రధాని మోదీ దిష్టి బొమ్మ దహనం చేశారు. మోదీ దిష్టి బొమ్మ దహనం చేసే కార్యక్రమంలో పోలీసులు, కాంగ్రెస్ నాయకుల మధ్య స్వల్ప ఉద్రిక్తత ఏర్పడగా కాంగ్రెస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలిపారు.
ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో మోదీ ఎలక్షన్ కమిషన్ను తన గుప్పిట్లో పెట్టుకొని దొంగ ఓట్లు సృష్టించి అధికారంలోకి వచ్చాడన్నారు. రాహుల్ గాంధీ ఓట్లలో దొంగతనం జరిగిందని బయటపెట్టగానే ఎలక్షన్ కమిషన్ తన అధికారి వెబ్ సైట్ను బ్యాన్ చేసిందని, ఒకవేళ ఎలక్షన్ కమిషన్ తప్పు చేయకుంటే ఎందుకు వెబ్సైట్ను బ్యాన్ చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ 10 సంవత్సరాలుగా ఓట్ల నమోదు ప్రక్రియలో తప్పు జరుగుతుందని పదేపదే చెప్తున్న విషయం నేడు వెలుగులోకి వచ్చిందని, ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని అన్నారు.
దేశంలో నిజాయితీ గల నాయకుడు కేవలం రాహుల్ గాంధీ అని ఎల్లప్పుడు ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ మెంబర్ రామకృష్ణ, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, రాష్ట్ర ఎన్ఎస్యూఐ ప్రధాన కార్యదర్శి వేణు రాజ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగం, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు యాదగిరి ,వివిధ ఆలయాల చైర్మన్ లు లవంగ ప్రమోద్, మధు సుదన్, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రామకృష్ణ, వినయ్, సంగెం సాయిలు తదితరులు పాల్గొన్నారు.