వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించిన బాధితుడు
సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ) : వడ్డీ రేటులో తేడా చేసిన ఓ ఫైనాన్స్ సంస్థ చర్యలను వినియోగదారుల కమిషన్ తప్పుపట్టింది. బాధితుడికి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. మూసాపేట బాలాజీనగర్కు చెందిన యశ్వంత్కుమార్ 2018లో ఆదిత్య బిర్లా ఫైనాన్స్ లిమిటెడ్లో రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత వడ్డీ రేటు 11 నుంచి 11.50 వరకు పడుతుందని, ప్రాసెసింగ్ ఫీజు ఒక్క శాతం తీసుకుంటామన్న ఒప్పందంతో రూ.8లక్షల రుణం మంజూరు చేశారు.
అందుకు గాను బాధితుడు ఈఎంఐలు సైతం క్రమం తప్పకుండా కడుతున్నాడు. కాగా, కొద్ది కాలానికి ఫైనాన్స్ సంస్థ నుంచి ఈ- మెయిల్ వచ్చింది. అందులో వడ్డీరేటు 13.25 శాతం, ప్రాసెసింగ్ ఫీజు కింద 2 శాతం మినహాయించుకుంటున్నట్లు ఉంది. దీంతో తనకు చెప్పింది ఒకటి, వడ్డీ రేటు విధించింది మరొకటని నిర్ధారించుకున్నాడు. వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించి తనకు న్యాయం చేయాల్సిందిగా కోరాడు. విచారణ జరిపిన కమిషన్ అధ్యక్షులు బి. ఉమా వెంకట సుబ్బలక్ష్మి, సభ్యురాలు సి. లక్ష్మి ప్రసన్నతో కూడిన బెంచ్ బాధితుడికి రూ.5వేల నష్టపరిహారంతో పాటు మరో రూ.5వేలు ఖర్చు కింద ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.