వరంగల్ లీగల్ : మైనర్ బాలికను అపహరించి అత్యాచారం చేసిన వ్యక్తికి న్యాయస్థానం ఏడు సంవత్సరాల జైలుశిక్ష విధించింది. నర్సింహులపేట మండలం భీరిశెట్టి గూడెం గ్రామానికి చెందిన మిదతపల్లి మధు అనే వ్యక్తి ఆటో డ్రైవర్గా ఓ పాఠశాలలో పని చేశాడు. అదే పాఠశాలలో చదువుతున్న బాలికను ప్రేమ పేరుతో పదేపదే వేధించేవాడు. ఈ క్రమంలో 4-8-2016 రోజున సదరు బాలికను మిత్రుల సహాయంతో అతని బంధువుల నివాసంలో నిర్బంధించి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు.
బాలిక మూడు రోజుల తర్వాత బాలిక తల్లిదండ్రులకు విషయం తెలుపడంతో నిందితుడిపై నర్సింహులపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ కిరణ్ కేసు దర్యాప్తు చేసి, నిందితుడిపై ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి జయ కుమార్ నిందితుడు నేరం చేశాడని నిర్ధారించి, అపహరణ, లైంగిక దాడి నేరం కింద ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించారు. కేసులో కోర్టు డ్యూటీ కానిస్టేబుల్ నరేందర్ సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టారు.