న్యూఢిల్లీ : కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతో మీ విద్యుత్ కనెక్షన్ తొలగిస్తామని తప్పుడు విద్యుత్ బిల్లులను ప్రజలకు పంపి మోసగిస్తున్న వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి పోలీసులు మూడు మొబైల్ పోన్లు, 3 సిమ్ కార్డులు, 20 డెబిట్, క్రెడిట్ కార్డులు, 4 చెక్బుక్లు. ఓ భారత్పే పీవోఎస్ మెషీన్ను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడిని దినేష్ చంద్గా పోలీసులు గుర్తిచారు. సైబర్ పోలీస్ స్టేషన్ను సందర్శించిన ఫిర్యాదుదారు నేరానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. గతంలో చెల్లించిన బిల్లులు అప్డేట్ కాకపోవడంతో విద్యుత్ కనెక్షన్ రాత్రి 9.30 గంటలకు డిస్కనెక్ట్ అవుతుందని విద్యుత్ కార్యాలయం నుంచి తనకు వాట్సాప్ మెసేజ్ వచ్చిందని బాధితుడు చెప్పారు. తాను ఇచ్చిన మొబైల్ నెంబర్లో తమ ఎలక్ట్రిసిటీ కస్టమర్ సర్వీసును సంప్రదించాలని ఆ మెసేజ్లో ఉందని తెలిపారు.
తన మొబైల్లో ఎలక్ట్రిసిటీ ఏపీకే ఫైల్ను డౌన్లోడ్ చేసుకోవాలని తనకు ఓ కాల్ వచ్చిందని కూడా వెల్లడించారు. ఏపీకే ఫైల్ను డౌన్లోడ్ చేసుకుని మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోగానే రూ 49,805, రూ 49,645 విలువైన లావాదేవీలు జరిగినట్టు, తన అకౌంట్ నుంచి అంతేమొత్తం డెబిట్ అయినట్టు మెసేజ్ రావడంతో షాక్ తిన్నానని ఫిర్యాదుదారు వివరించారు. సాంకేతిక అంశాలతో పాటు సమగ్రంగా దర్యాప్తు సాగించిన మీదట నిందితుడిని ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో గుర్తించి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.