గర్మిళ్ల, జనవరి 16: పతంగి మాంజా దారం గొంతుకు తగిలి బైక్పై వెళ్తున్న వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన మంచిర్యాల పట్టణంలో శనివారం జరిగింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గుంజపడుగుకు చెందిన పాస్త భీమయ్య (40) బతుకుదెరువు కోసం మంచిర్యాలలో ఉంటున్నాడు. సంక్రాంతి సందర్భంగా ఇంటి ఆవరణలో కట్టెలు కొడుతుండగా భీమయ్య చేతికి గాయమైంది. దీంతో భార్య శారదతో కలిసి బైక్పై ఆర్ఎంపీ వద్దకు వెళ్లాడు. టీటీ ఇంజక్షన్ వేయించుకొని ఇంటికి వస్తున్నాడు. పాత మంచిర్యాల బ్రిడ్జి వద్ద రోడ్డు పక్కన ఉన్న కరెంట్ స్తంభానికి మాంజా చుట్టుకొని రోడ్డుకు అడ్డంగా ఉంది. దానిని గమనించని భీమయ్య బైక్ను ముందుకు తీసుకెళ్తుండగా ఆ దారం గొంతును కోసింది. లోతుగా తెగడంతో భీమయ్య అక్కడిక్కడే మృతిచెందాడు. అతనికి కొడుకు ప్రవీణ్, కూతురు అక్షర ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ ఎస్సై తైసొద్దీన్ తెలిపారు.