అమృత్సర్: స్వర్ణ దేవాలయంలో వ్యక్తిపై దాడి, హత్య ఘటనను మరువకముందే పంజాబ్లో అదే తరహాలో మరో మూకదాడి జరిగింది. కాపుర్తలా జిల్లాలోని గురుద్వారా మీద ఉన్న జెండాను తొలగించేందుకు ఓ ఆగంతకుడు యత్నించాడని ఆగ్రహించిన భక్తులు దాడి చేయడంతో అతడు మరణించాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం నిజాంపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కానీ, వేరే సంస్థలు కానీ జోక్యం చేసుకోవద్దని గురుద్వారా ఓ ప్రకటనలో పేర్కొంది. గురుద్వారాలను అపవిత్రం చేస్తున్న ఘటనలకు రాష్ట్రప్రభుత్వం, రాష్ట్ర పోలీసులే బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. గురుద్వారాను అపవిత్రం చేసే చర్యలేవీ జరుగలేదని, దొంగతనం చేసేందుకు యత్నించాడన్న కారణంతో కొట్టి చంపారని పోలీసులు చెబుతున్నారు. ‘అమృత్సర్, కాపుర్తలాలో దురదృష్టకరమైన సంఘటనలు జరుగడంపై చాలా సీరియస్గా ఉన్నాం. మత సామరస్యానికి భంగం కలిగించేందుకు యత్నిస్తే తీవ్ర చర్యలు తీసుకొంటాం’అని పంజాబ్ డీజీపీ సిద్ధార్థ్ చటోపాధ్యాయ ట్విట్టర్లో హెచ్చరించారు.