ఖైరతాబాద్, నవంబర్ 18 : రాజ్భవన్ ముందు గురువారం ఓ రైతు కూలీ ఆత్మహత్యకు యత్నించాడు. జై కేసీఆర్, జై తెలంగాణ, జై జగదీశ్వర్రెడ్డి అంటూ నినాదాలు చేస్తూ, వారు నా దేవుళ్లంటూ తన వెంట తెచ్చుకొన్న పెట్రోల్ను ఒంటిపై పోసుకొని ఆత్మహత్య చేసుకొనేందుకు యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని అడ్డుకొని, పంజాగుట్ట స్టేషన్కు తరలించారు. సూర్యాపేట జిల్లా మోతె మండలం లాల్తండాకు చెందిన బానోతు నాగరాజు(38) వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, కుమారుడు, కూతరు ఉన్నారు.
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ ధర్నాకు రావటం చూడలేకేనని తానీ చర్యకు పూనుకొన్నట్టు నాగరాజు తెలిపాడు. సూర్యాపేటలో రైతులపై దాడి చేసింది బీజేపీ నేతలేనని, పైగా టీఆర్ఎస్ నాయకులే దాడి చేశారని అసత్యపు ప్రచారాలు చేశారని వెల్లడించాడు. రైతుల సంక్షేమానికి ఎవరూ పాటుపడనంతగా సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారని, రైతుబంధుతో కష్టాలు తీర్చారని, రైతు బీమాతో భరోసా కల్పించారని చెప్పుకొచ్చాడు.
రైతుల కోసం అహర్నిశలు పాటుపడుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆ పార్టీ నేతలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పాడు. వాళ్ల అసత్యపు ఆరోపణల వల్ల ప్రజల కోసం పాటుపడే ముఖ్యమంత్రి ధర్నాకు రావాల్సి వచ్చిందని, అది చూడలేక.. బీజేపీ నేతల బండారం బయటపెట్టేందుకు ఆత్మహత్యకు యత్నించానని పేర్కొన్నాడు.