చేర్యాల, ఫిబ్రవరి 20 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో నిండిపోయింది. స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించే ఉత్సవాలలో 6వ వారం సందర్భంగా రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.
6వ వారం సందర్భంగా సుమారు 22 వేల మంది భక్తులు మల్లన్నను దర్శించుకున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి. శనివారం సాయంత్రం కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ప్రైవేటు, ఆలయ నిర్వహణలో ఉన్న దాతల గదులను అద్దెకు తీసుకుని రాత్రికి బస చేశారు.
అనంతరం ఆదివారం వేకువ జామునే నిద్రలేచి కోనేటిలో పవిత్రంగా స్నానాలు అచరించారు. స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశ ఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు తదితర మొక్కులు తీర్చుకోవడంతో పాటు కొరికలు తీర్చాలని స్వామి వారిని వేడుకున్నారు. మహిళల భక్తిశ్రద్ధలతో బోనాలు తయారు చేసి కొండ పైన ఉన్న ఎల్లమ్మ తల్లికి బొనాలు సమర్పించారు.