సిద్దిపేట : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి బ్రహ్మోత్సవాల 11వ ఆదివారం సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి సుమారు 25వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి. ‘మల్లన్న స్వామి.. మమ్మేలు స్వామి’ అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో శైవక్షేత్రం మార్మోగింది. గుట్టపై ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి వారి సోదరి ఎల్లమ్మను దర్శించుకోవడంతో పాటు మట్టి పాత్రలతో భక్తిశ్రద్ధలతో బోనం తయారు చేసి కొండపైకి తీసుకుపోయి అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.