మాలే: చైనా అనుకూల వైఖరి అనుసరిస్తున్న మాల్దీవులు అధ్యక్షుడు ముయిజ్జుకు ఆ దేశ ఓటర్ల నుంచి మద్దతు లభించింది. ఆయన నాయకత్వం వహిస్తున్న ‘పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్’ (పీఎన్సీ) మాల్దీవులు పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. 93 స్థానాలున్న మాల్దీవులు పార్లమెంట్ (మజ్లిస్)కు ఆదివారం ఎన్నికలు జరగ్గా, 86 స్థానాల్లో ఫలితాలు ప్రకటించారు. ఇందులో 66 స్థానాల్ని పీఎన్సీ కైవసం చేసుకుంది. మరో 7 స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాక.. పీఎన్సీ మెజార్టీ మరింత పెరిగే అవకాశముంది. ప్రధాన ప్రతిపక్షం ‘ఎండీపీ’ కేవలం 12 స్థానాలకు పరిమితమైంది. దీంతో చైనాతో ఆర్థిక సంబంధాల్ని పెంచుకోవటం, భారీ ప్రాజెక్టులను చైనాకు అప్పగించటం, వివాదాస్పద స్థలంలో వేలాది భవన నిర్మాణాలు.. మొదలైన వాటిపై ముయిజ్జు ప్రభుత్వానికి పార్లమెంట్లో అనుకూల పరిస్థితి ఏర్పడింది.