సిటీబ్యూరో, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో చారిత్రక దిగుడు బావులు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ శాఖలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి కళతప్పిన చారిత్రక మెట్లబావులను పునరుద్ధరిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 44 చోట్ల దిగుడు బావులను పునరుద్ధరించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మేరకు ఇప్పటికే ఆరు చోట్ల అద్భుతంగా తీర్చిదిద్ది దాని వైభవాన్ని ఎలుగెత్తి చాటారు. బాపుఘాట్, గచ్చిబౌలి, గుడి మల్కాపూర్, శివంబాగ్, బన్సీలాల్పేట, సీతారాంబాగ్లో పరిరక్షణ చర్యలను చేపట్టారు. మరో 34 చోట్ల బావుల పునరుద్ధరణ పనులు ప్రతిపాదన దశలో ఉన్నాయని పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అర్వింద్కుమార్ తెలిపారు. బన్సీలాల్పేట కోనేరు బావి పునరుద్ధరణకు ముందు, ఆ తర్వాత గల చిత్రాలను శనివారం ట్విట్టర్లో అర్వింద్కుమార్ పొందుపర్చారు. చారిత్రక కట్టడాల సంరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని ఆయన చెప్పారు.
గతమెంతో ఘన చరిత్ర
నిజాం హయాంలో ప్రజల నీటి అవసరాల కోసం నిర్మించిన బన్సీలాల్పేట కోనేరు బావి 30.5 మీటర్ల పొడవు, 19.2 ఫీట్ల వెడల్పుతో విస్తరించి ఉంది. ఈ బావి నాటి కళాకారుల కళా నైపుణ్యాన్ని చాటి చెప్పింది. ఇప్పటికీ శిథిలమై ఉన్న రాతి అశ్వపు శిల్పాలు, రాతీ స్తంభాలు కొలనులో దర్శనం ఇస్తుంటాయి. ఈ కోనేరు బావి పునరుద్ధరణతో స్థానికంగా భూ గర్భజలాలు గణనీయంగా పెరిగి, కోనేరులో భారీగా ఊట నీరు ఉబికివస్తుండడం గమనార్హం.
పునరుద్ధరణ ఇలా..
భావితరాల కోసం..
గతమెంతో చరిత్ర కలిగిన బన్సీలాల్పేట కోనేరు బావిని భావితరాలు గుర్తుంచుకునే విధంగా తీర్చిదిద్దాం. చారిత్రాత్మక సంపదను, పురాతన కట్టడాల పరిరక్షణ, బావుల పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ సర్కారు అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. బన్సీలాల్పేటలో స్థానికులు ఈ బావిలోని నీటిని అనేక రకాలుగా వినియోగించే వారు. కాలక్రమేణా చెత్తా చెదారంతో పూర్తిగా మూసుకుపోయి, నిరుపయోగంగా మారింది. స్థానికుల కోరిక మేరకు బావి పునరుద్ధరణకు శ్రీకారం చుట్టాం. ప్రస్తుతం భూగర్భ జలాలు పెంపొందాయి.